డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ నిర్ణయం
డిజిటల్ లావాదేవీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం మరో గట్టి చర్య తీసుకున్నది. డెబిట్ కార్డులు, భీమ్ యాప్ ద్వారా రూ.2 వేల లోపు జరిపే లావాదేవీలపై విధించే మర్చంట్ డిస్కౌంట
డిజిటల్ లావాదేవీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం మరో గట్టి చర్య తీసుకున్నది. డెబిట్ కార్డులు, భీమ్ యాప్ ద్వారా రూ.2 వేల లోపు జరిపే లావాదేవీలపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ శుక్రవారం వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి ఆమోదం లభించదని ఆయన తెలిపారు. జనవరి 1 నుంచి వరుసగా రెండేళ్ల పాటు ఈ లావాదేవీలకు సంబంధించి అయ్యే రుసుముల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆయన వివరించారు. దీని వల్ల ప్రభుత్వంపై రెండు సంవత్సరాలకు గాను రూ. 2512 కోట్ల భారం పడుతుందని అంచనా.
మనం కార్డ్ స్వైప్ చేసి మనకు కావాల్సిన వస్తువును కొనుక్కొని వస్తాం. అయితే దీనికి సంబంధించి ఒకరి నుంచి మరొకరికి సొమ్ము బదలాయింపు జరిగేందుకు వెనుక చాలా ప్రాసెస్ జరగాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక హెచ్డీఎఫ్సీ బ్యాంకు దుకాణంలో కార్డ్ స్వైపింగ్ మెషీన్ ఏర్పాటు చేసి ఉంటుంది. అందులో వివిధ బ్యాంకుల కార్డులను వినియోగదారులు స్వైప్ చేస్తారు. అప్పుడు వివిధ బ్యాంకుల నుంచి అందులోకి మనీ ట్రాన్స్ ఫర్ జరుగుతుంది. అంతే కాకుండా ఒక బ్యాంకు, మరో బ్యాంకు మధ్య నగదు బదిలీలకు సంబంధించి ఒప్పందాలు ఉంటాయి. ఇదంతా జరగాలంటే సాంకేతికతకు, ఆ మెషీన్ల ఏర్పాటుకు ఖర్చవుతుంది. చాలా చోట్ల దుకాణాల్లో ఇవి సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు వ్యాపారులు సిద్దంగా లేరు. అలాంటి క్రమంలో చాలా బ్యాంకులు తామే సొంత ఖర్చుతో వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. అక్కడ నెట్వర్క్ కోసం అయ్యే ఖర్చును చాలా వరకూ దుకాణదారులే భరిస్తున్నారు. అందుకే చాలా మంది వీటిని వాడుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో వైపు బ్యాంకులు ఈ ఖర్చులను వ్యాపారుల నుంచే వసూలు చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. వారు పరోక్షంగా వీటిని వినియోగదారులపైనే రుద్దేందుకు చూస్తున్నారు.
ఈ క్రమంలో డిజిటల్ లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నది. అందుకే వీటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అటు ప్రజలపైన కానీ ఇటు వ్యాపారులపైన కానీ భారం పడకూడదని ప్రభుత్వం సంకల్పించినట్లుంది. దీంతో అంతిమంగా వీటికయ్యే ఖర్చును రెండేళ్ల పాటు భరించేందుకు కేంద్రం సిద్దం అయింది. స్వల్ప కాలంలో ఇది ప్రభుత్వానికి ఖరీదైన వ్యవహరం అయినప్పటికీ దీర్ఘకాలంలో అకౌంటబిలిటీ, ట్రాన్సపరెన్సీ పెరుగుతాయనే భావనతో కేంద్రం ఈ కీలక చర్యకు పూనుకుంది.