గాల్వాన్ ఎఫెక్ట్ : జొమాటో టీ షర్ట్స్ కాల్చి నిరసన తెలిపిన డెలివరీ బాయ్స్
ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీల్లో ఒకటైన జొమాటో కు గాల్వాన్ లోయ సెగ తగిలింది. అక్కడ చైనా ఆర్మీ 20 మంది భారత జవాన్ల ను చంపేసిన విషయం తెలిసిందే. సరిహద్దులో నెలకొన్న వివాదంలో జరిపిన కొట్లాటలో తెలుగు వీర సైనికుడు కర్నల్ సంతోష్ బాబు మృతి చెందిన విషయం విదితమే. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా చైనా కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ ప్రభావం చైనా పెట్టుబడులు కలిగిన కంపెనీల పై కూడా పడుతోంది.
తాజాగా కోల్కతా లో కొందరు జొమాటో డెలివరీ బాయ్స్ తమ అధికారిక టీ షర్టు లను చింపి వాటిని కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు. చైనా కుబేరుడు జాక్ మా కు చెందిన అలీబాబా గ్రూప్ నకు జొమాటో లో సుమారు 26% వాటా ఉండటమే ఈ నిరసనకు కారణమైంది. అలీబాబా గ్రూప్ అనుబంధ సంస్థ ఆంట్ ఫైనాన్సియల్ ... జొమాటో లో భారీగా పెట్టుబడులు పెట్టి కంపెనీ లో నాలుగో వంతు కంటే అధిక వాటాను చేజిక్కించుకుంది.
ఇండియాలో చైనా పెట్టుబడులు ఎంత పెరిగాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు
360 మిలియన్ డాలర్ల పెట్టుబడులు...
జొమాటో లో ఇప్పటి వరకు పలు విడతల్లో ఆంట్ ఫైనాన్సియల్ 360 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అంటే సుమారు రూ 2,880 కోట్లు అన్నమాట. దీంతో కంపెనీలో సుమారు 26% వాటాను చేజిక్కించుకుంది. ఇండియన్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో విపరీతమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ రంగంలో స్విగ్గి, జొమాటో లు నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. లాభాలు రాకపోయినా మార్కెట్ వాటా చేజిక్కించుకునేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. దీంతో వీటికి రూ వేల కోట్లలో పెట్టుబడులు అవసరం అవుతున్నాయి. అందుకే, పెట్టుబడుల సమీకరణ లోనూ ఈ రెండు కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఇన్వెస్టర్ల ను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే జొమాటో చైనా కు చెందిన పెట్టుబడి సంస్థల నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించింది.
సహించేంది లేదు...
మన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు గడిస్తూ... మన ఆర్మీ పైనే దాడులు చేస్తున్నారు. మన భూభాగాన్ని ఆక్రమిస్తున్నారు. దీనిని సహించేది లేదు. ఆకలితో అలమటించినా సరే ... చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీల్లో పనిచేసేది లేదు అని నిరసన తెలిపిన సందర్భంగా జొమాటో డెలివరీ బాయ్స్ చెప్పినట్లు పీటీఐ తన కథనంలో పేర్కొంది. ఇదిలా ఉండగా... ఇటీవల లాక్ డౌన్ తో బిజినెస్ తగ్గిపోవటంతో జొమాటో 500 కు పైగా ఉద్యోగులను తొలగించింది. ఐతే వారే ఈ నిరసనలు తెలిపారా లేదా.. ప్రస్తుత ఉద్యోగులా అనేది మాత్రం తేలలేదని పీటీఐ తెలిపింది. అయితే, నిరసన తెలిపిన వారంతా జొమాటో తొలగించిన వారేనని ది ఎకనామిక్ టైమ్స్ మరో కథనంలో వెల్లడించింది. ఈ మేరకు జొమాటో అధికార ప్రతినిధి తెలిపినట్లు ఆ సంస్థ పేర్కొంది.
వాటి పరిస్థితి ఏమిటో...
ఈ విషయం ఎలా ఉన్నా... మన దేశంలోని స్టార్టుప్ కంపెనీల్లో చైనా కు చెందిన అనేక ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు మెజారిటీ వాటాలు ఉన్న విషయం చాలా స్పష్టం. గత నాలుగు ఐదేళ్ళలో చైనా కంపెనీలు మన స్టార్టుప్ కంపెనీల్లోకి భారీ స్థాయిలో పెట్టుబడులు కుమ్మరించాయి. ఇందులో పేటీఎం, బిగ్ బాస్కెట్, ఓలా వంటి బడా స్టార్టుప్ కంపెనీలు కూడా ఉన్నాయి. పేటీఎం లో ఐతే అలీబాబా పెట్టుబడులు మెజారిటీ స్థాయిలో ఉన్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా - చైనా ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల మధ్య ఇండియా లో చైనా పై విపరీతమైన వ్యతిరేకత నెలకొంది. జొమాటో లో అది బయటపడింది. ఇది ముందు ముందు చైనా పెట్టుబడులు కలిగిన ఇతర కంపెనీల పైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.