ట్రిలియన్ డాలర్ల కంపెనీ కంటే గోప్యత ముఖ్యం: వాట్సాప్కు సుప్రీం చురక
న్యూఢిల్లీ: 'మీది ట్రిలియన్ డాలర్ల కంపెనీ కావొచ్చు. కానీ ప్రజల గోప్యత ముఖ్యం' అని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం వాట్సాప్కు చురకలు అంటించింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానంపై పై కీలక వ్యాఖ్యలు చేసింది. మీది రెండు మూడు ట్రిలియన్ డాలర్ల కంపెనీ కావొచ్చునని, కానీ ప్రజలు మాత్రం గోప్యతకు ప్రాధాన్యమిస్తారని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.
ఉద్యోగులకు గుడ్న్యూస్, వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డేస్!
ప్రజల్లో ఆందోళన
యూజర్ల డేటాను తమ మాతృసంస్థ ఫేస్బుక్తో పంచుకునేందుకు వీలుకల్పించేలా వాట్సాప్ తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. కొత్త ప్రైవసీ పాలసీతో తమ వ్యక్తిగత గోప్యతను కోల్పోతామేమోనని ప్రజల్లో ఆందోళన నెలకొందని సుప్రీం కోర్టు పేర్కొంది. పౌరుల గోప్యతను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంది. ఈ పిటిషన్పై 4 వారాల్లో స్పందన తెలియజేయాలని వాట్సాప్కు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
వాట్సాప్ తరఫున కపిల్ సిబాల్
కొత్త ప్రైవసీ పాలసీ విషయంలో యూరప్తో పోలిస్తే భారత పౌరుల పట్ల వాట్సాప్ తక్కువస్థాయి ప్రమాణాలను పాటిస్తోందని పిటిషన్ దాఖలైంది. వాట్సాప్ తరఫున న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. యూరప్ మినహా ప్రపంచమంత వాట్సాప్ ఒకే విధమైన ప్రైవసీ పాలసీని అమలు చేస్తోందన్నారు. యూరప్లో ప్రత్యేక చట్టం అమల్లో ఉందని, భారత్లోనూ ఈ తరహా చట్టం తెస్తే వాట్సాప్ దానిని పాటిస్తుందన్నారు.
డేటా రక్షణ చట్టం
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ వాదనలు వినిపించారు. వ్యక్తిగత గోప్యత ప్రమాణాలను వాట్సాప్ యూరోప్ దేశాలతో పోలిస్తే భారతీయులకు తగ్గిందని పేర్కొన్నారు. వాట్సాప్ డేటాను ఫేస్బుక్తో పంచుకోకుండా నిరోధించాలని కోరారు. డేటా రక్షణ చట్టాన్ని తీసుకురావాలని దివాన్ ప్రతిపాదించారని పేర్కొన్న సుప్రీం కోర్టు, ఈ ప్రతిపాదనను అభినందించింది.