యస్ బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 20 శాతానికి చేరుకోవచ్చు
తమ బ్యాంకు ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి పతాకస్థాయికి చేరుకుందని ప్రయివేటు రంగ యస్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఎన్పీఏల గుర్తింపుపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెల్లడయ్యాక, స్థూల నిరర్థక ఆస్తులు(GNPA) మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్నారు. మొత్తం ఆస్తులలో దాదాపు 20 శాతానికి జీఎన్పీఏ నిష్పత్తి చేరుకోవచ్చునని అంచనా వేశారు.
గతవారం యస్ బ్యాంకు డిసెంబర్ క్వార్టర్ ఫలితాలు వచ్చాయి. జీఎన్పీఏలు 15.36 శాతంగా ఉన్నాయి. ఆస్తుల నాణ్యతపై ఒత్తిడి తీవ్రస్థాయికి చేరినా, సానుకూల అంశాలు కనిపిస్తున్నాయని, కలెక్షన్స్ మెరుగుపడుతున్నట్లు తెలిపారు. చెక్ బౌన్స్ రేటు పరిశ్రమ సరాసరి స్థాయికి తగ్గిందని, రికవరీ పెరిగిందన్నారు.
యస్ బ్యాంకు 2020 డిసెంబర్ 31 నాటికి జారీ చేసిన రూ.1.69 లక్షల కోట్ల రుణాల్లో రూ.18,551 కోట్లకు పైగా ఒత్తిడిలో ఉన్నాయి. రూ.8,322 కోట్లు స్టాండ్ ఫాల్ అకౌంట్స్, రూ.6,537 కోట్లు కోట్లు 61 రోజుల నుండి 91 రోజుల మధ్య అడ్వాన్స్ ఓవర్ డ్యూ, రూ.3,692 కోట్లు కరోనా రీస్ట్రక్చర్ లోన్స్ ఉన్నాయని తెలిపారు.