షాకింగ్: భారత్ గతంలో ఎన్నడూ చూడని సంక్షోభం, జీడీపీ 45% డౌన్
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ నేపథ్యంలో గత రెండు నెలలుగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ కారణంగా భారత్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మాంద్యాన్ని ఎదుర్కోబోతుందని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. జూన్ క్వార్టర్లో దేశ జీడీపీ 45 శాతానికి పడిపోయే అవకాశముందని తెలిపింది. గతంలో ఇచ్చిన నివేదికలో 20 శాతం తగ్గుదల ఉంటుందని అంచనా వేసింది. ఇప్పుడు దానిని సమీక్షించింది. అయితే థర్డ్ క్వార్టర్ సమయానికి 20 శాతం పుంజుకునే అవకాశముందని తెలిపింది. నాలుగో క్వార్టర్లో 14 శాతం పుంజుకొని వచ్చే ఏడాది మొదటి క్వార్టర్లో 6.5% వద్ద స్థిరంగా ఉంటుందని తెలిపింది.
మోడీ అలా ఇస్తే మాకేం ప్రయోజనం, దేశానికి మరింత హాని.. లాక్డౌన్ తర్వాత సంక్షోభంలోకి
ఇలాంటి మాంద్యాన్ని భారత్ గతంలో చూడలేదు
వచ్చే ఏడాది 2021 ఆర్థిక సంవత్సరం నాటికి వాస్తవ జీడీపీ 5 శాతం క్షీణించే అవకాశం ఉందని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. ఇలాంటి మాంద్యాన్ని భారత్ గతంలో ఎన్నడు చవిచూడలేదని నివేదికలో పేర్కొంది. భారత్ లాక్ డౌన్ను మే 31వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని నిబంధనలు సడలించారు. ఇది కాస్త ఊరట కలిగిస్తోంది.
రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై..
కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కూడా గోల్డ్మన్ శాక్స్ స్పందించింది. ఇది భారత జీడీపీలో 10 శాతం. గత కొద్ది రోజులుగా అనేక రంగాలకు కేంద్రం ప్యాకేజీ ప్రకటిస్తోంది. అనేక సంస్కరణలు తీసుకు వస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఇవన్నీ ఆర్థిక వ్యవస్థపై తక్షణ ప్రభావం చూపదని గోల్డ్మన్ శాక్స్ అభిప్రాయపడింది. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇది సరిపోకపోవచ్చునని చెప్పారు.
వాటిని పరిగణలోకి తీసుకొని...
గత కొద్ది రోజులుగా అనేక రంగాలలో నిర్మాణాత్మక సంస్కరణ ప్రకటనలు చేశారని గోల్డ్మన్ శాక్స్ ఆర్థిక నిపుణులు ప్రచీ మిశ్రా, ఆండ్రూ టిల్టన్ అన్నారు. ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ ప్రకటించిన ప్యాకేజీ కాస్త బాగానే ఉందని అభిప్రాయపడ్డారు. తమ తాజా అంచనా తాజా లాక్ డౌన్ పొడిగింపు, శ్రామిక శక్తి వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు గోల్డ్మన్ శాక్స్ తెలిపింది.