ఇక ఐటీ ఉద్యోగుల ఆఫీస్ బాట: టీసీఎస్, ఇన్ఫీ, విప్రో.. అదే దారి
కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్కు క్రమంగా ముగింపు పలుకుతున్నాయి. తమ ఉద్యోగులను కార్యాలయానికి రప్పించేందుకు పలు ఐటీ కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి రప్పించడం ద్వారా హైబ్రిడ్ వర్క్ మోడల్ను ఫాలో కానున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో వర్క్ ఫ్రమ్ హోమ్ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఇచ్చాయి. ఇప్పుడు కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ దాదాపు పూర్తి కావొస్తు ఉండటం వంటి అంశాలు కార్యాలయానికి రప్పించేందుకు దోహదపడుతున్నాయి.
భారత ఐటీ నెంబర్ వన్ కంపెనీ.. టీసీఎస్ ఉద్యోగుల్లో 70 శాతం మంది వ్యాక్సీన్ వేయించుకున్నారు. 95 శాతం మందికి కనీసం ఒక డోస్ పూర్తయింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ నేపథ్యంలో ఈ కంపెనీ ఉద్యోగుల్లో ఎక్కువమంది వ్యాక్సీన్ వేయించుకున్నారు. '75 శాతం టీసీఎస్ ఉద్యోగులకు వ్యాక్సీన్ పూర్తయింది. 95 శాతం ఉద్యోగులు కనీసం ఒక డోస్ వేసుకున్నారు' అని చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కాడ్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 90 శాతం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు టీసీఎస్ ప్లాన్ చేస్తోంది. లేదా కనీసం 2022 క్యాలెండర్ ఏడాది ప్రారంభమయ్యే నాటికైనా ఈ టార్గెట్ రీచ్ కావాలని భావిస్తోంది. అయితే 2025 నాటికి తమ ఉద్యోగుల్లో 25 శాతం వర్క్ ఫ్రమ్ చేయవచ్చునని తెలిపింది.
ఇన్ఫోసిస్ ఉద్యోగుల్లో 86 శాతం మంది కనీసం ఒక డోస్ వేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాము హైబ్రిడ్ వర్క్ మోడల్ వైపు చూస్తున్నామని కంపెనీ చెుతోంది. కరోనా మహమ్మారి సమయంలో హైబ్రిడ్ వర్క్ మోడల్ పాపులర్ అయింది. వీటితో పాటు మారికో, విప్రో వంటి ఐటీ కంపెనీలు కూడా హైబ్రిడ్ వర్క్ మోడల్ దిశగా సాగుతున్నాయి. 18 నెలల వర్క్ ఫ్రమ్ హోమ్ అనంతరం తమ ఉద్యోగులు వారానికి రెండుసార్లు కార్యాలయానికి వస్తున్నారని, వ్యాక్సినేషన్ పూర్తయిన వారు వస్తున్నారని విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ తెలిపారు. ఇక హెచ్సీఎల్ టెక్నాలజీలో సీనియర్ ఉద్యోగులు కార్యాలయాలకు వస్తున్నారు. వీరు వారానికి రెండు రోజులు వస్తున్నారు.