వెనక్కి తగ్గాల్సిందే: వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ, కేంద్రం ఘాటు లేఖ
న్యూఢిల్లీ: వాట్సాప్ ప్రైవసీ పాలసీకి సంబంధించి భారత ప్రభుత్వం సదరు సంస్థకు లేఖ రాసింది. ప్రైవసీ పాలసీ మార్పులను ప్రతిపాదించిన ఈ మెసేజింగ్ యాప్ తీరుపై కేంద్రం ఘాటుగా స్పందించింది. డేటా గోప్యత విధానంలో ఏకపక్షంగా మార్పు ఏమాత్రం సముచితం కాదని, అలాగే ఆమోదయోగ్యమూ కాదని తేల్చి చెప్పింది. ప్రతిపాదిత మార్పులను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వాట్సాప్ సీఈవోకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ లేఖ రాసింది.
40 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్న భారత మార్కెట్ వాట్సాప్కు కీలకమని ఈ లేఖలో గుర్తు చేసింది.డేటా పంచుకునే విషయంలో యూజర్ల అభిమతంతో పని లేకుండా ఏకపక్షంగా ప్రైవసీ పాలసీ మార్చడం, పౌరుల స్వయంప్రతిపత్తిపై పడే పరిణామాలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. సమాచార గోప్యత, ఐచ్చికాలు ఎంచుకునే స్వేచ్ఛ, డేటా భద్రత అంశాల్లో ధోరణి మార్చుకోవాలని వాట్సాప్కు సూచించింది.
కాగా, ఫేస్బుక్తో పాటు ఇతర గ్రూప్ సంస్థలతోను యూజర్ల డేటా పంచుకునే విధంగా ప్రైవసీ పాలసీని మారుస్తున్నామని, దీనిని అంగీకరించే వినియోగదారులు మాత్రమే తమ సేవలు పొందుతారని వాట్సాప్ ఇటీవల ప్రకటించింది. దీనిపై విమర్శలు రావడం, ఇతర మెసేజింగ్ యాప్స్ వైపు మరలుతుండటంతో దీనిపై కాస్త తగ్గిన వాట్సాప్, వాయిదా వేసింది.