5G Jobs: 5G రాకతో కొత్త కొలువులు.. రానున్న మూడు నెలల్లో.. వీరికే అధిక డిమాండ్..
New Jobs: భారత్లో నెక్స్ట్ జనరేషన్ 5జీ టెక్నాలజీకి సంబంధించిన బిడ్డింగ్ ముగిసింది. మరికొద్ది నెలల్లో దేశంలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ రంగంలోని 4 అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలు విస్తరణకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. రానున్న మూడు నెలల కాలంలో దీని ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
5G టెక్నాలజీ..
ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల్లో 5జీ టెక్నాలజీ అందుబాటులో ఉంది. తాజాగా భారత్లో 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన వేలంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ డేటా కంపెనీలు ప్రధానంగా వేలంలో పాల్గొన్నాయి. వారం రోజుల పాటు జరిగిన ఈ వేలంలో సుమారు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన స్పెక్ట్రమ్ వేలం జరిగింది.
కొత్త ఉద్యోగ అవకాశాలు..
ఈ స్థితిలో బిడ్డింగ్ తరువాత టెలికాం కంపెనీలు తమ కస్టమర్లకు 5జీ టెక్నాలజీని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో 5G టెక్నాలజీని ప్రవేశపెట్టడం వల్ల, వచ్చే త్రైమాసికంలో దేశంలో దాదాపు 6 వేల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఆపరేటర్లు, సేల్స్మెన్, కేబుల్ ఇన్స్టాలర్లకు అధిక డిమాండ్ ఉందని నివేదికలు చెబుతున్నాయి.
టెలికాం నియామకాలు..
2021లో టెలికాం కంపెనీలు డిసెంబర్ నుంచి 5G టెక్నాలజీ కోసం అవసరమైన ఉద్యోగులను నియమించుకోవడం ప్రారంభించినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య 45%, జనవరి - మార్చి త్రైమాసికంలో 65%, ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో 75% ఉద్యోగుల నియామకం జరిగింది.
2023 నాటికి మరిన్ని ఉద్యోగాలు..
5జీ టెక్నాలజీ వల్ల 2023 ఆర్థిక సంవత్సరం నాటికి టెలికాం రంగంలో 18,000 నుంచి 20,000 ఉద్యోగాలు వస్తాయని పరిశ్రమ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. నియామకాల్లో జోరు కొనసాగుతుందని వారు అంటున్నారు. 5G వేలం ముగియకముందే, రోల్ అవుట్ ప్లాన్లు అమలులోకి రాకముందు నుంచే టెలికాం కంపెనీలు తమ బ్రాడ్బ్యాండ్ కార్యకలాపాలను విస్తరించడం ప్రారంభించేశాయి. ఈ కారణంగా ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త టెక్నాలజీ రాక దేశంలోని నిరుద్యోగులకు వరంగా మారనుంది.