ఐటీ కంపెనీల గుడ్న్యూస్: డోంట్ వర్రీ.. ఆఫర్ వచ్చిందా.. మీ ఉద్యోగం మీకే! అక్కడే కొంత ఇబ్బంది
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కోట్లాది ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని తెలిపాయి. అదే సమయంలో కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ ఉద్యోగులకు కొంత అదనపు వేతనం ఇచ్చాయి. విప్రో, యాక్సెంచర్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్.. ఇలా అన్ని ఐటీ సంస్థలు కూడా ఇటీవలి కాలంలో మధ్యలో నిలిచిన ఉద్యోగ ఆఫర్లపై భరోసా కల్పిస్తున్నాయి. ఈ కంపెనీలు మరో అడుగు కూడా ముందుకేశాయి.
70 ఏళ్లలోనే అతిపెద్ద సంక్షోభం..మోడీకి రఘురాం రాజన్ కీలక సూచన
డోంట్ వర్రీ.. ఆఫర్ లెటర్ వచ్చిందా.. మీ ఉద్యోగం మీకే!
కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు పోయే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ఉద్యోగాల విషయం పక్కన పెడితే వివిధ కంపెనీల్లో ఇప్పటికే ప్రాసెస్లో ఉన్న ఉద్యోగాలు లేదా ఆఫర్ లెటర్స్ వచ్చిన వాటి పరిస్థితి ఏమిటనే ఊగిసలాటలో చాలామంది ఉన్నారు. అయితే ఇలాంటి వారికి ఐటీ రంగ దిగ్గజాలు హామీ ఇచ్చి, వారిలో ధీమాను నింపాయి.
ఈ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు..
వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు పోయే ప్రమాదముందనే ప్రస్తుత తరుణంలో ఇండియాలో విప్రో, యాక్సెంచర్, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు మధ్యలో నిలిచిన కొత్త ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నాయి. అంటే ప్రాసెస్లో ఉన్న వాటిని కొనసాగించనున్నాయి. ఈ కంపెనీలు వర్చువల్ ఆన్-బోర్డింగ్ రిక్రూట్మెంట్స్ ప్రారంభించాయి. ఇందులో ఫ్రెషర్స్ కూడా ఉన్నారు.
గత ఏడాది 2 లక్షల కొత్త ఉద్యోగాలు
మన దేశంలో అతిపెద్ద రంగాల్లో ఐటీ ఒకటి. ఈ రంగంలోని కంపెనీలు దాదాపు ప్రతి నెల 20,000 ఉద్యోగ ఆఫర్లు ఇస్తుంటాయి. Nasscom ప్రకారం సాఫ్టువేర్ రంగం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 2,05,000 కొత్త ఉద్యోగాలు ఇచ్చింది. ఈ రంగంలో ఉద్యోగుల సంఖ్య 45 లక్షల వరకు ఉంది.
యాక్సెంచర్ శుభవార్త
లాక్ డౌన్ ముందు వరకు ఉన్న ఆఫర్లను కొనసాగిస్తామని యాక్సెంచర్ తెలిపింది. వర్చువల్ ఇంటర్వ్యూలు కొనసాగించనుంది. అలాగే, కొత్తగా చేరిన ఉద్యోగులకు వారు చేరినప్పడి నుండే అన్ని కంపెనీ ప్రయోజనాలు అందిస్తామని యాక్సెంచర్ తెలిపింది. ఈ మేరకు యాక్సెంచర్ ఇండియా హ్యూమన్ రిసోర్సెస్ మేనేజింగ్ డైరెక్టర్, లీడ్ లక్ష్మీ సీ తెలిపారు.
యాక్సెంచర్లో ప్రతి నెల 2500 కొత్త ఉద్యోగాలు
ఐటీ రంగంలోని దిగ్గజ కంపెనీల్లో యాక్సెంచర్ ఒకటి. ఇండియాలో గత ఆర్థిక సంవత్సరంలో (2019-20) సగటున దాదాపు ప్రతి నెలలో 2,500 మంది ఉద్యోగులను తీసుకుంది. ఇండియాలో ఈ సంస్థకు 2 లక్షల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు.
ప్రాసెస్ పూర్తి చేస్తామని టెక్ మహీంద్రా
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని, ప్రాసెస్లో ఉన్న ఉద్యోగాలను, ఇప్పటికే ఇచ్చిన ఆఫర్ లెటర్స్ను గౌరవిస్తామని టెక్ మహీంద్రా చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్షవేంద్ర సోయిన్ అన్నారు.
విప్రోది అదే దారి
ఇప్పటికే తాము ఇచ్చిన అన్ని ఆఫర్ లెటర్స్ను గౌరవిస్తామని విప్రో కూడా ప్రకటించింది. ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, టీసీఎస్, మైండ్ ట్రీ వంటి కంపెనీలు అదే దారిలో నడిచే అవకాశాలు లేకపోలేదు.
కొందరికి వాయిదా ఊరట
కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లను గౌరవిస్తున్నాయని, మరికొన్ని కంపెనీలు మాత్రం వాయిదా వేస్తున్నాయని లేదా ఇప్పుడు ఉన్న కంపెనీలలో ప్రస్తుతానికి అలాగే ఉండాలని, తర్వాత చూస్తామని చెబుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని సందర్భాలలో కొన్ని కంపెనీలు ఒక నెల వేతనం ఇస్తున్నయని ఎక్స్ఫెనో కో ఫౌండర్ కమల్ కారంత్ అన్నారు.
కొత్త ఆఫర్లు సరే.. కొన్ని ఇబ్బందులు
అయితే కొత్త ఆఫర్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవకాశముంటే ఈ-ఆన్బోర్డింగ్ వైపు దృష్టి సారించాయి. కానీ చాలామంది ఈ-ఆన్బోర్డింగ్ కోసం లాజిస్టిక్స్, సెక్యూరిటీ ఇష్యూలు ఎధుర్కొంటున్నారు. కొత్త నియామకాల కోసం కొన్ని కంపెనీలు BYOD (బ్రింగ్ యువర్ ఓన్ డివైస్) అంటే మీ ల్యాప్టాప్ మీరు ఉపయోగిండి అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చాయి. అయితే ఇవి కాస్త ఇబ్బందికర అంశాలే అంటున్నారు.
ఐటీ దిగ్గజాలకు బ్యాకెండ్ సపోర్ట్
యాక్సెంచర్, టెక్ మహీంద్రా, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఆన్లైన్ ఆన్-బోర్డింగ్ను ప్రారంభించాయి. వీటికి ఐటీ బ్యాకెండ్ సపోర్ట్ ఉంటుంది. ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో వర్చువల్ ఆన్ బోర్డింగ్ ప్రక్రియను ప్రారంభించామని, ఇది బాగా వర్కవుట్ అవుతుందని టెక్ మహీంద్రా తెలిపింది.