కరోనా వైరస్: ఎక్కువ కరెన్సీ ముద్రించి పేదలకు పంచుతారా?
అవును. కష్టకాలంలో చాలా మందికి ఇలాంటి ఆలోచనలో వస్తాయి. ఇంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రభుత్వమే ఎక్కువ మొత్తంలో కరెన్సీ (డబ్బులు) ముద్రించి లేని వారికి పంచితే బాగుంటుంది కదా అని ఆలోచిస్తారు. ఇది కేవలం ఒక్క మన దేశానికో లేదా కొందరికి వచ్చే ఆలోచనో కాదు. నిత్యం చాలా మంది ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు కటిక దరిద్రంలో జీవిస్తున్నారు. కానీ, వారి పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు కొంత డబ్బు నేరుగా వారికి అందించవచ్చు కదా అని భావిస్తుంటారు.
ఇప్పుడు కరోనా వైరస్ పుణ్యమా అని మళ్ళీ అందరి మెదడు లో ఇదే ఆలోచన మొదలైంది. దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఏ పని చేసుకునే అవకాశం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని కోట్లాది మంది ప్రజలు నెలల కొద్దీ పని చేయకపోతే ఎలా బతుకుతారు అనేది అందరికి వచ్చే అనుమానమే. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నంగా పేదలకు బియ్యం, పప్పు ఉచితంగా ఇవ్వటమే కాకుండా కొంత ఆర్థిక సహాయం కూడా చేయనున్నట్లు ప్రకటించాయి.
అప్పటికే యాక్ట్ ఆఫ్ గాడ్ విజ్ఞప్తుల వెల్లువ, వీరికి EMI ఊరట రెండు నెలలే!
కానీ, ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత సరుకులు, లేదా నగదు ఎక్కడికీ సరిపోదు. మళ్ళీ వారు ఏ అప్పో సప్పో చేయాల్సిందే. కాబట్టి, ఒక్కో వ్యక్తి అకౌంట్ లో రూ 10,000 నుంచి రూ 12,000 జమ చేయగలిగితే ఎంత బాగుండు అని చాలా మందికి అనిపించవచ్చు.
కరెన్సీ ప్రింటింగ్ కు కొన్ని నిబంధనలు..
ఏ దేశమైనా తమ సొంత కరెన్సీ ని ముద్రించేందుకు కొన్ని నిబంధనలు పాటిస్తుంది. వ్యవస్థలో ఎంత ద్రవ్య లభ్యత ఉంది, ఇంకా ఎంత వరకు ద్రవ్యాన్ని అందుబాటులోకి తేవాలని అని ఎప్పటికప్పుడు నిర్దేశితమైన వ్యూహాలను అమలు చేస్తుంది. ముఖ్యంగా ప్రతి దేశంలో ఆ దేశానికి చెందిన సెంట్రల్ బ్యాంకు ... అంటే మన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లాంటి సంస్థ కరెన్సీ ని ముద్రించి సిస్టం లో కి ఒక పధ్ధతి ప్రకారం అందుబాటులోకి తెస్తుంది.
కొన్ని విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధిక కరెన్సీ ని కూడా ముద్రించి ప్రభుత్వానికి అప్పుగా చెల్లిస్తుంది. అయితే, ఈ అదనపు ముద్రణ మాత్రం కొన్ని షరతులకు లోబడి జరుగుతుంది. నిజానికి ఏ దేశానికి కూడా ఇంతే కరెన్సీ ముంద్రించాలనే నిర్దిష్టమైన విధానం ఉండదు. కానీ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనా వేస్తూ సెంట్రల్ బ్యాంకులు అవసరానికి తగ్గట్లు కరెన్సీ ని సిస్టం లోకి అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రస్తుతం మన దేశంలో మొత్తం రూ 21.1 లక్షల కోట్ల విలువైన ద్రవ్య లభ్యత అందుబాటులో ఉంది. ఇది పూర్తిగా కరెన్సీ రూపంలో ఉన్న సొమ్ము. దీనికి ఒక 2-3 శాతం వరకు అదనంగా ప్రింట్ చేయటం వల్ల పెద్దగా నష్టం జరగదు. కానీ, ఇబ్బడి ముబ్బడిగా ప్రింట్ చేస్తే లాభం అటుంచి నష్టాలే ఎక్కువగా జరుగుతాయి.
అమెరికా ఎక్కువ ప్రింట్ చేస్తుందట...
అగ్ర రాజ్యం అమెరికా తీరు ఎవరికీ అంతు చిక్కదు. అమెరికా డాలర్ కు ప్రపంచమంతా డిమాండ్ ఉంటుంది కాబట్టి... వారు ఎంత ప్రింట్ చేసినా మార్కెట్లో దానికి గిరాకీ తగ్గదు అని ఆర్థికవేత్తలు చెబుతుంటారు. మరో వైపు ప్రపంచంలోనే అత్యధిక పెద్ద మొత్తంలో వస్తువులు, సేవలను వినియోగించే దేశం అమెరికా నే కావటం విశేషం. ప్రపంచం మొత్తం తయారు చేసే దానిలో కనీసం 10% మైనా ఈ ఒక్క దేశమే వినియోగిస్తుందంటే అది ఎంత పెద్ద మార్కెటో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అమెరికా తనకు అవసరమైన మేరకు కొన్నిసార్లు అధిక మొత్తంలో కరెన్సీ ప్రింట్ చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు విలవిలలాడుతున్న అమెరికా... ఒక్కో పౌరుడికి 1,200 డాలర్లు (దాదాపు రూ 90,000) ఖాతాల్లో జమ చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇందుకోసం అమెరికా ఇప్పటికే 2 లక్షల కోట్ల డాలర్ల ప్రత్యేక ప్యాకేజీ ని ప్రకటించింది కూడా.
జింబాబ్వే లో ఏం జరిగిందో తెలుసా?
ఆఫ్రికా లో ఉన్న పేద దేశాల్లో జింబాబ్వే కూడా ఒకటి. క్రికెట్ ఆట గురించి తెలిసిన వారికి జింబాబ్వే ను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. ఆ దేశంలో ప్రభుత్వం అక్కడ పేదరికాన్ని నిర్మూలించాలని తొందరపడి అవసరానికి మించి చాలా అధిక మొత్తంలో నగదు ను ప్రింట్ చేసింది. దానిని ప్రజలకు చేరేలా చేసింది. కానీ ఒక్క ఏడాదిలోనే ఆ దేశంలో ద్రవ్యోల్బణం రంకెలేసింది. అంటే అక్కడ అన్ని రకాల సరుకులు, సేవల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఎంతలా అంటే మనం లెక్కపెట్టడానికి కూడా సాధ్యం కానంత పెద్ద సంఖ్యలో రేట్లు పెరిగిపోయాయి. ఉదాహరణకు ఒక పూట భోజనానికి మన దగ్గర అయితే రూ 70 నుంచి రూ 125 ఖర్చు అవుతుంది. కానీ, అదే జింబాబ్వే లో అయితే కొన్ని వేల కోట్ల జింబాబ్వే డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అతి తక్కువ విలువైన కరెన్సీ గల దేశంగా జింబాబ్వే అవతరించింది. అవసరానికి మించి కరెన్సీ ముద్రించటంతో పేదరికం తగ్గటం మాట అటుంచి, మరింత సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ఆ దేశం.
ధరలు విపరీతంగా పెరుగుతాయి...
అందరి చేతిలో దండిగా డబ్బులు ఉంటే ... వస్తువులు, సేవల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. సాధారణ సమయంలో కిలో టమాటో రూ 20 లభిస్తే... అదే అందరి వద్ద చాలా డబ్బుందనుకుంటే అది కాస్త రూ 200 అయి కూర్చుంటుంది. అంటే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అదే సమయంలో దేశ ఆర్థిక ద్రవ్య లోటు విపరీతంగా పెరిగిపోతుంది. దాని వల్ల ప్రపంచ మార్కెట్లో మన కరెన్సీ విలువ తగ్గుతుంది. మన దేశానికి అప్పులిచ్చే సంస్థలు, దేశాలు కొత్తగా రుణాలు మంజూరు చేయవు. ఎందుకంటే మన దేశ ద్రవ్య లోటు అధికంగా ఉంది అంటే మనం తీసుకున్న రుణాలను సమయానికి తిరిగి చెల్లించలేం అని అది చెప్పకనే చెబుతుంది. కాబట్టి, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో దేశానికి అధిక డబ్బుల కంటే మంచి ఆరోగ్యమే అవసరం. అందుకే, ప్రభుత్వానికి సహకరించి ఇంటికే పరిమితం అవుదాం. మహమ్మారి కరోనా పై విజయం సాధిద్దాం.