9 నెలల్లో సెన్సెక్స్ వరస్ట్ పతనం, బడ్జెట్కు ముందు దిద్దుబాటు!
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు సోమవారం (జనవరి 24) కుప్పకూలాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 57,000 పాయింట్ల దిగువకు కూడా పతనమైంది. కానీ అతి స్వల్పంగా కోలుకొని, 57,500 పాయింట్ల సమీపంలో ముగిసింది. నిఫ్టీ కూడా 17000 పాయింట్ల దిగువను తాకి, ఆ తర్వాత ఈ స్థాయికి పైన ముగిసింది. ఈ రోజు సూచీలు అత్యంత దారుణంగా పతనమయ్యాయి. గత తొమ్మిది నెలల కాలంలో సూచీల అత్యంత చెత్త ప్రదర్శన ఇదే. అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి. ఆటో, మెటల్, ఐటీ, పవర్, ఫార్మా, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్ 2 శాతం నుండి 6 శాతం మేర పడిపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 4 శాతం క్షీణించాయి.
2050 పాయింట్ల పతనమై...
సెన్సెక్స్ నేడు ఉదయం 59,023.97 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,023.97 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,984.01 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. తద్వారా ఓ సమయంలో 2050 పాయింట్ల మేర క్షీణించింది. ఉదయం నుండి సెన్సెక్స్ అంతకంతకూ దిగజారి, మధ్యాహ్నం గం.2.15 సమయానికి రెండువేల పాయింట్లకు పైగా పడిపోయింది. ఆ తర్వాత కొద్దిగా కోలుకొని 1,545.67 (2.62%) పాయింట్లు నష్టపోయి 57,491.51 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17,575.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,599.40 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,997.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 468.05 (2.66%) పాయింట్లు నష్టపోయి 17,149.10 పాయింట్ల వద్ద ముగిసింది.
బడ్జెట్ దిద్దుబాటు
గత సోమవారం సూచీలు అతి స్వల్పంగా లాభపడ్డాయి. మంగళవారం నుండి వరుసగా నాలుగు రోజులు నష్టపోయాయి. గతవారం సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా పతనం కాగా, నేడు ఒక్కరోజే దాదాపు అదే స్థాయిలో కుప్పకూలింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.15 లక్షల కోట్లకు పైగా నష్టపోయింది. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్క షేర్ కూడా లాభపడలేదు.
అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు, పేటీఎం, జొమాటో, నైకా వంటి కొత్త షేర్ల భారీ పతనం, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ, కంపెనీల మార్జీన్లు ఒత్తిడిలో ఉండటం, రష్యా-ఉక్రెయిన్ వివాదం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు మార్కెట్ భారీ నష్టాలకు కారణం. దీనికి తోడు ప్రధానంగా బడ్జెట్ ముందస్తు దిద్దుబాటు కనిపిస్తోందని అంటున్నారు.
50 శాతం డౌన్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో సిప్లా, ఓఎన్జీసీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో జేఎస్డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసీమ్, హిండాల్కో ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ దాదాపు నాలుగు శాతం నష్టపోయింది. వొడాఫోన్ ఐడియా 7 శాతం, జొమాటో 20 శాతం, పేటీఎం దాదాపు 5 శాతం నష్టపోయాయి. పేటీఎం, కార్ ట్రేడ్, పీబీ ఫిన్ టెక్, ఫినో పేమెంట్స్ బ్యాంకు స్టాక్స్ అయితే ఇష్యూ ధరతో పోలిస్తే 50 శాతం వరకు నష్టపోయాయి.