4 రోజుల్లో సెన్సెక్స్ 2200 పతనం, రూ.9.5 లక్షల కోట్ల సంపద హుష్కాకి, ఎందుకు?
స్టాక్ మార్కెట్ కుప్పకూలుతోంది. దేశీయ సూచీలు వరుసగా నాలుగో రోజైన శుక్రవారం (జనవరి 21) నష్టపోయాయి. ఉదయం నష్టాల్లోనే ప్రారంభమై, ఆ తర్వాత అదే ఒరవడిని కొనసాగించాయి. మధ్యాహ్నం ఓ సమయంలో 59,000 పాయింట్ల దిగువకు పతనమైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ భారీ నష్టాల్లోనే ముగిసింది. మెటల్, ఫార్మా, పీఎస్యూ బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ కుప్పకూలాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మాత్రమే అదరగొట్టాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు రెండు శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి.సెన్సెక్స్ 59,000 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17,650 పాయింట్ల దిగువన ముగిసింది.
రూ.9.73 లక్షల కోట్ల సంపద డౌన్
సెన్సెక్స్ వరుసగా నాలుగు రోజులు నష్టపోయింది. మంగళవారం 554 పాయింట్లు, బుధవారం 656 పాయింట్లు, గురువారం 634 పాయింట్లు, నేడు (శుక్రవారం) 427 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. ఈ నాలుగు రోజుల్లో 2250 పాయింట్లకు పైగా క్షీణించింది. ఈ వారంలో సెన్సెక్స్ సోమవారం స్వల్ప లాభాల్లో లేదా స్థిరంగా ముగిసింది. సెన్సెక్స్ ఈ వారం 61,300 పాయింట్లకు పైన ప్రారంభమై, ఇప్పుడు 59,000 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నాలుగు రోజుల్లోనే ఇన్వెస్టర్లు రూ.9.73 లక్షల కోట్లు నష్టపోయారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.280 లక్షల కోట్ల నుండి రూ.270 లక్షల కోట్లకు తగ్గింది.
అందుకే నష్టాలు
అంతర్జాతీయ మార్కెట్లు గత కొద్దిరోజులుగా కరెక్షన్కు గురవుతున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతామనే ప్రకటనతో టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ పెరిగాయి. ఇన్వెస్టర్లు పసిడి, కరెన్సీ వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లారు. ఇలా వివిధ అంశాలు ప్రభావం చూపి ఆసియా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి.
అమెరికాతో పాటు మన దేశంలోను ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచే అవకాశముందని సంకేతాలు వచ్చాయి. ఇది మార్కెట్ పైన ప్రభావం చూపింది. ఇటీవల ఎస్బీఐ, ఐసీఐసీఐ సహా వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. ఇది వడ్డీ రేటు పెంపుకు మొదటి అడుగుగా చెబుతున్నారు.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు. అధిక వ్యాల్యూ వద్ద ట్రేడ్ అవుతుండటంతో భారత మార్కెట్ నుండి డబ్బును ఇతర మార్కెట్లకు తరలిస్తున్నారని మార్కెట్ నిపుణుల అభిప్రాయం. గత ఏడాది అక్టోబర్ నుండి ఇప్పటి వరకు రూ.1 లక్ష కోట్లకు పైగా విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం ముదిరినట్లుగా కనిపిస్తోంది. ఇది అంతర్జాతీయ మార్కెట్ల పైన ప్రభావం చూపుతోంది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఆటో, హెచ్యూఎల్, మారుతీ సుజుకీ, హీరో మోటో కార్ప్, నెస్ట్లే ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, శ్రీ సిమెంట్స్, కోల్ ఇండియా, దివిస్ ల్యాబ్స్ ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో రిలయన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, HUL, HDFC ఉన్నాయి.
నేడు సెన్సెక్స్ 59,039.37 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,329.63 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,620.93 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 427 పాయింట్లు నష్టపోయి 59,037 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17,613.70
పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,707.60 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,485.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 139 పాయింట్లు క్షీణించి 17,617 పాయింట్ల వద్ద ముగిసింది.