అమ్మకాలు లేవు.. అయినా ధరలు పెంచుతున్నారు.. ఎందుకంటే?
ఏదైనా వస్తువు అమ్ముడు పోవాలంటే దాని ధరను తగ్గించడం లేదా ఏదైనా ఆఫర్ ను ప్రకటించడం మనం చూస్తుంటాం. ఇలాంటి సందర్భంలో కంపెనీలు అనుకున్న స్థాయిలో అమ్మకాలను నమోదు చేసుకుంటాయి. తమ టార్గెట్ ను చేరుకున్న తర్వాత మళ్ళీ ధరలను యథాతథ స్థితికి తీసుకువస్తారు. అయితే కార్ల కంపెనీలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఓ వైపు అమ్మకాలు తగ్గుతున్నాయని గగ్గోలు పెడుతూనే మరోవైపు ధరల పెంపు ప్రకటనలు చేస్తున్నాయి. దీని వెనుక కంపెనీల మార్కెట్ వ్యూహం వుంది. గత కొంత కాలంగా కంపెనీలు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాయి. దీనివల్ల కొన్ని కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంటే మరికొన్ని కంపెనీలకు మాత్రం ఆశించిన స్థాయి ఫలితాలు అందడం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
డిసెంబర్ లోనే ఎందుకు?
* సాధారణంగా కార్ల కంపెనీలు డిసెంబర్ లో ధరల పెంపునకు సంభందించిన ప్రకటనలు చేస్తుంటాయి. ఇందుకు ప్రత్యేకమైన కారణం ఉంది. అదేమిటంటే... డిసెంబర్ ఆఖరి నెల కాబట్టి ఈ నెలలో అమ్మకాలను పెంచుకుంటే కంపెనీలు పూర్తి సంవత్సరానికి సంబంధించిన అమ్మకాల గణాంకాలను ప్రకటిస్తాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాదిలో అమ్మకాల్లో వృద్ధి ఏవిధంగా ఉంది, వచ్చే ఏడాదిలో అమ్మకాలను ఏ స్థాయిలో పెంచుకోవాలన్న దాని గురించి అంచనాలు ప్రకటించడానికి అవకాశం ఏర్పడుతుంది.
* డిసెంబర్లో వాహనాలను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపారు. ఏడాది చివరి నెల అయినప్పటికీ అది సంబంధిత సంవత్సరానికి సంబందించిన మోడల్ గానే పరిగణిస్తారు. దీన్ని విక్రయించే సమయంలో ఏడాదిని బట్టి తరుగుదల, వాహన ధరను నిర్ణయిస్తారు. కాబట్టి ఈ నెలలో ఎక్కువ మంది వాహనాలను కొనుగోలు చేరడానికి ఆసక్తి చూపారు.
* అందుకే అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఆఫర్లను ప్రకటించాయి.
ధరల పెంపు
* జనవరి నుంచి కార్ల ధరలను పెంచ నున్నట్టు ఇప్పటికే మారుతీ సుజుకి, టాటా మోటార్స్ ప్రకటించాయి.
* తాజాగాకార్ల ధరలను పెంచనున్నట్టు హ్యుండై ప్రకటించింది. మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో కార్ల ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయి. మోడల్, వేరియంట్, మార్కెట్ను బట్టి ధరల్లో పెరుగుదల ఉంటుంది.
బీఎస్ 6 ప్రభావం
* వచ్చే ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా భారత్ స్టేజ్ 6 నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అప్పటి నుంచి ఈ ప్రమాణాలకు అనుగుణంగా మార్కెట్లోకి వచ్చిన కార్లను, ఇతర వాహనాలను మాత్రమే రిజిస్టర్ చేస్తారు. ఈ నిబంధనలకు అనుగుణంగా వచ్చిన కార్ల ధరలు మరింతగా పెరగనున్నాయి.
* అటు కంపెనీలు పెంచే ధరలు ఇటు బీఎస్ 6 ద్వారా పెరిగే ధరలతో కొనుగోలుదారులపై మరింతగా భారం పడే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అమ్మకాలు ఎంత తగ్గాయంటే...
* వాహనాల అమ్మకాలు నవంబర్ నెలలోను తగ్గాయి. ప్యాసెంజర్ కార్స్, స్కూటర్లు, మోటారుసైకిళ్ల అమ్మకాల్లో రెండంకెల క్షీణత నమోదయింది.
*అయితే యుటిలిటీ వాహనాల విభాగంలో మాత్రం మంచి వృద్ధి నమోదైంది. కియా మోటార్స్ కు చెందిన సెల్టోస్, మారుతీ బ్రేజ్జా, ఎక్స్ ఎల్ 6, ఎర్టిగా, హ్యుండై వెన్యూ వంటి మోడళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది.
* భారత ఆటో మొబైల్ మాన్యుఫ్యాక్చరర్ల సంఘం ( సియామ్) వెల్లడించిన గణాంకాల ప్రకారం నవంబర్ నెలలో యుటిలిటీ వాహనాల అమ్మకాలు 33 శాతం పెరిగి 92,739 యూనిట్లకు చేరాయి. ప్యాసెంజర్ కార్ల అమ్మకాలు 8 శాతం క్షీణించి 1,60,306 యూనిట్లకు చేరుకున్నాయి.
* స్కూటర్ల అమ్మకాలు 12 శాతం క్షీణించి 4,59,851 యూనిట్లకు చేరాయి.