భారత్కు ప్రస్తుతం పెను సవాల్, మేం అలా వెళ్తున్నాం: టాటా చంద్రశేఖరన్
కరోనా మహమ్మారి ప్రభావం దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా భారీగా పడిందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ టాటా గ్రూప్ మారుతోందని చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. కంపెనీ వార్షిక సాధారణ సమావేశం (AGM) సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మార్కెట్ పెద్ద సవాల్ను ఎదుర్కొంటోందన్నారు. భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదని అభిప్రాయపడ్డారు. టాటా సన్స్ ద్రవ్యపరంగా బలంగా ఉందని చెప్పారు.
మరో అడుగు: చైనాకు హీరో సైకిల్స్ రూ.900 కోట్ల షాకిచ్చి, ఇక్కడి వారికి అండగా..
ఇవి సవాల్గా మారాయి
ఫిబ్రవరిలో టాటా కెమికల్స్ టాటా గ్లోబల్ బీవరేజెస్లో విలీనమైన తర్వాత నిర్వహించిన తొలివార్షిక సమావేశం ఇది. కరోనా కారణంగా దీనిని వర్చువల్ విధానంలో నిర్వహించారు. భారతీయ మార్కెట్లో రవాణాకు సంబంధించి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కార్మికులు పెద్ద ఎత్తున వలస వెళ్తున్నారని, ప్రయాణాలు, రవాణాపై నియమ నిబంధనలు అమలులో ఉండటం, రిటైల్ కార్యకలాపాలను గాడిన పెట్టే అంశాలు సవాల్ అన్నారు.
కరోనా పరిస్థితి.. అవకాశాలు కల్పిస్తోంది
ప్రస్తుత పరిస్థితులు అవకాశాలను కూడా కల్పిస్తున్నాయని చంద్రశేఖరన్ తెలిపారు. తమ బీవరేజెస్, ఆహార వ్యాపారాల విలీనంతో తమకు ఎదిగేందుకు బలమైన వేదిక లభించినట్లుగా అయిందన్నారు. ప్రస్తుత పరిస్థితి తమకు ఎంతో నేర్చుకొనే అవకాశం కల్పించిందని, భవిష్యత్తులో ఈ పరిస్థితుల నుండి మరింత బలంగా ఎదుగుతామన్నారు.
ఇలా పరిస్థితులకు అనుగుణంగా
టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ పూర్తిస్థాయి ఎఫ్ఎంసీజీ సంస్థగా అవతరిస్తుందని చెప్పారు. మంచి డిమాండ్, వృద్ధి కనబరుస్తున్నట్లు తెలిపారు. టాటా కన్స్యూమర్స్ రిటైల్, ఆన్లైన్ అమ్మకాల్లో పెరుగుదల నమోదు చేసిందని చెప్పారు. ఫుడ్ సర్వీస్ సేల్స్ ప్రభావితమైందన్నారు. కస్టమర్లకు కొత్త డెలివరీ మోడల్స్, బ్రాండ్ క్యాంపెయిన్, వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనలో మార్పు ఇలా వివిధ అంశాలను గమనిస్తూ సరికొత్త పరిస్థితులకు అనుగుణంగా వెళ్తున్నామన్నారు.
మెరుగుపడుతుంది
టాటా స్టార్ బక్స్ సంస్థ 2019-20 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 21 శాతం వృద్ధి రేటుతో దూసుకెళ్లిందని, కానీ కరోనా కారణంగా నాలుగో క్వార్టర్లో ప్రభావం పడిందన్నారు. స్వల్పకాలానికి స్టోర్స్ను తెరవడం, వ్యాపారం తిరిగి ప్రారంభించడానికి ఎంత వేగంగా సాధారణ పరిస్థితి నెలకొంటుందనే అంశాలు కీలకమన్నారు. డెలివరీ, ఓపెన్ పికప్ మార్గాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. స్వల్పకాలంలో ఇబ్బందులు ఉన్నా పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందన్నారు.