Walmart కీలక ప్రకటన: ఆ ఇబ్బందికర నిబంధన ఎత్తివేత..వారికి మాత్రమే
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి ప్రస్తుతం ప్రపంచం మొత్తం ముఖాలకు మాస్కలను వేసుకుని తిరుగుతోంది. వైరస్ బారిన పడకుండా ఉండటానికి మాస్క్ తప్పనిసరి చేశాయి అన్ని దేశాలు. భారత్ వంటి కొన్ని దేశాలు మాస్కులు లేకుండా తిరిగే వారికి జరిమానాలను కూడా విధిస్తోన్నాయి ఇలా ఎన్ని రోజులు మాస్కులు వేసుకుని తిరగాలో తెలియని పరిస్థితి చాలాచోట్ల నెలకొంది. మాస్కులు ధరించడం అనేది రోజువారీ జీవితంలో ఓ భాగమౌతుందని ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి.
మాస్కుల్లేకుండా షాపింగ్
ఈ పరిస్థితుల్లో అమెరికాకు చెందిన ప్రఖ్యాత రిటైల్ జెయింట్ వాల్మార్ట్ (Walmart) కీలక ప్రకటన చేసింది. మాస్కులు ధరించాలనే నిబంధనను ఎత్తివేసింది. మాస్కులు లేకుండా షాపింగ్ చేసుకోవచ్చని సూచించింది. ఈ విధానాన్ని ఈ నెల 18వ తేదీ నుంచి అమల్లోకి తీసుకుని రానున్నట్లు తెలిపింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. వ్యాక్సిన్ వేసుకోని వారు మాస్కులు ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న కొనుగోలుదారులతో పాటు వాల్మార్ట్ సిబ్బంది కూడా ఇక మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి బోనస్
దీనితో పాటు మరో బంపర్ ఆఫర్ను కూడా ప్రకటించిందా సంస్థ మేనేజ్మెంట్. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తమ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది అందరికీ 75 డాలర్లను బోనస్గా చెల్లిస్తామని తెలిపింది. ఇప్పటికే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అయిన వారికి వచ్చేనెల వేతనంతో కలిపి ఈ మొత్తాన్ని ఇస్తామని స్పష్టం చేసింది. కరోనా వైరస్ వంటి కంటికి కనిపించని ప్రాణాంతక మహమ్మారిపై సాగించిన ప్రతి అమెరికన్ పౌరుడికీ తాము ధన్యవాదాలను తెలుపుతున్నట్లు వాల్మార్ట్ పేర్కొంది. సుదీర్ఘ పోరాటంలో అమెరికన్లు విజయం సాధించారని వ్యాఖ్యానించింది. గత ఏడాది జులై నుంచి మాస్కులు తప్పనిసరి చేశామని, ఇప్పుడు దాని అవసరం లేదని తెలిపింది.
జో బిడెన్ ప్రకటన చేసిన మరుసటి రోజే..
అమెరికా త్వరలోనే మాస్కుల రహిత దేశంగా ఆవిర్భవిస్తుందంటూ ఆ దేశాధ్యక్షుడు జో బిడెన్ ప్రకటన చేసిన మరుసటి రోజే వాల్మార్ట్ దాన్ని అమల్లోకి తీసుకుని రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు మాస్కులు లేకుండా స్వేచ్ఛగా తిరిగొచ్చని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని జో బిడెన్ వెల్లడించారు. అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్లోని రోజ్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి జో బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మాస్కులు ధరించకుండా హాజరయ్యారు. డబుల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇక ఎంతో కాలం మాస్కులు వేసుకుని తిరగబోరని ప్రకటించారు.
ముమ్మరంగా వ్యాక్సిన్.
కరోనా వైరస్ను నిర్మూలించడానికి అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తొలి వంద రోజుల నాటికి 200 మిలియన్ల మందికి వ్యాక్సిన్ వేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందక్కడి అధికార యంత్రాంగం. ఇప్పటికే 170 మిలియన్ల మంది వరకు వ్యాక్సిన్ వేశారు.ఫైజర్-బయోఎన్టెక్, మోడెర్నా వ్యాక్సిన్లను అక్కడ వినియోగిస్తోన్నారు. 12 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడానికి యూఎస్ఎఫ్డీఏ ఇదివరకే అనుమతులు కూడా మంజూరు చేసింది.