వినియోగదారులకు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా షాక్, ఛార్జీల పెంపు
ముంబై: కస్టమర్లకు టెలికం కంపెనీలు షాకిచ్చాయి. తమ టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు సోమవారం ప్రకటించాయి. పెంచనున్న ధరలు డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. అలాగే, డిసెంబర్ ప్రారంభంలో ధరలు పెంచుతామని భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. అయితే ఎంత మొత్తం పెంచుతారనే అంశాన్ని ఈ రెండు టెలికం దిగ్గజాలు కూడా వెల్లడించలేదు. టారిఫ్ పెంపుకు ఈ రెండు కంపెనీలు కారణాలు కూడా వెల్లడించాయి.
కంపెనీ చరిత్రలో తొలిసారి: టాటా రికార్డ్ బ్రేక్.. వొడాఫోన్ ఐడియా నష్టం రూ.50 వేలకోట్లు
టారిఫ్ పెంచడానికి కారణాలు ఏం చెప్పాయంటే?
తమ కస్టమర్లకు ప్రపంచస్థాయి డిజిటల్ సేవలు అందించేందుకు టారిఫ్ పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. వ్యాపారం లాభసాటిగా మార్చేందుకు పెంచుతున్నట్లు ఎయిర్ టెల్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్లో రెండు కంపెనీలు కూడా భారీ మొత్తంలో నష్టాలను ప్రకటించిన విషయం తెలిసిందే. నష్టాలను ప్రకటించిన కొద్ది రోజులకే టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటించాయి. రెండో క్వార్టర్లో వొడాఫోన్ ఐడియా రూ.50,921 కోట్లు, ఎయిర్టెల్ రూ.23,045 కోట్ల మేర నష్టాన్ని నమోదు చేశాయి.
ఇప్పటికే ఐడియా కనీస ఛార్జ్
ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇప్పటికై కనీస ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. డేటా లేకుండా వొడాఫోన్ ఐడియా నెలవారీ మొబైల్ సర్వీస్ కనీస ఛార్జ్ రూ.24 నుంచి ప్రారంభమవుతుండగా, డేటా సర్వీసులతో రూ.33 నుంచి ప్రారంభమవుతుంది.
ఇప్పటికే ఎయిర్ టెల్ కనీస ఛార్జ్
ఎయిర్ టెల్ కూడా నెలవారీ ప్లాన్ రూ.24 నుంచి ప్రారంభం అవుతుంది. డేటాతో కూడిన ప్లాన్ రూ.35 నుంచి ప్రారంభం అవుతోంది. గత కొద్ది నెలలుగా ఈ ఛార్జీల విధానాన్ని ఈ రెండు కంపెనీలు అమలు చేస్తున్నాయి.
టారిఫ్ పెంపుకు అందుకే సిద్ధం..
2016లో జియో వచ్చిన తర్వాత టెలికం రంగ ముఖచిత్రం మారింది. ముఖ్యంగా టెలికం పరిశ్రమలో ధరల యుద్ధం చోటు చేసుకుంది. ఈ ధరల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకే వొడాఫోన్, ఐడియా ఒక్కటయ్యాయి. అయినా ఆర్థిక ఇబ్బందులు తొలగలేదు. విలీనం తర్వాత ధరల పోటీలో కూడా భారీగా నష్టపోయింది. వొడాఫోన్ - ఐడియా, ఎయిర్ టెల్ నుంచి చాలామంది వినియోగదారులు ఇటీవలి వరకు జియో వైపు వెళ్లారు. ఉచిత డేటా, కాల్స్, మెసేజ్లతో 4G సేవల సంస్థగా వచ్చిన జియో సంచలనాలు సృష్టించింది. తక్కువ ధరకు ఇంటర్నెట్ ప్యాకేజీతో పెద్ద ఎత్తున కస్టమర్లను ఆకట్టుకుంది. ఫలితంగా అప్పటికే ఉన్న ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థల ఆదాయం తగ్గిపోయింది. పైగా జియోకు పోటీగా చార్జీల్ని తగ్గించడంతో నష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టారిఫ్ పెంపుకు సిద్ధమవుతున్నాయి.