వాయిస్ కాల్, డేటా ఛార్జీలు పెరుగుతున్నాయి.. గుడ్ న్యూస్!! జియో టారిఫ్ పెంచితే మరింత భారం..
2016లో జియో ఎంట్రీ తర్వాత కస్టమర్లకు అతి తక్కువ ధరలకే వాయిస్ కాల్స్, డేటా వచ్చింది. దీంతో వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ వంటి కంపెనీలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఇది రివర్స్ అవుతోంది. తాజాగా, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు ఛార్జీలు పెంచుతామని సోమవారం ప్రకటించాయి. డిసెంబర్ నెలలో ఇవి అమలు చేస్తామని తెలిపాయి. మరుసటి రోజు జియో కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. అనంతరం ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ కూడా ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది.
టెలికం కష్టాలు: అప్పుల్లో కూరుకుపోయి...
జియో పెంచితే..
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రానున్న కొద్ది రోజుల్లో ధరలు పెంచితే ఆ తర్వాత భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా టారిఫ్ను 30 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ జియో దాదాపు 15 శాతం వరకు పెంచితే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సరాసరిన 30 శాతం వరకు పెంచవచ్చునని అంచనా.
అలా పెంచుతామని జియో...
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో రెండోసారి టారిఫ్ పెంపుపై చాలా జాగ్రత్తగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఔట్ గోయింగ్ కాల్స్ పైన ఛార్జ్ వేస్తోంది. జియో మూడేళ్ల క్రితం అతి చౌక ధరలకే వాయిస్ కాల్స్, డేటా యుద్ధానికి నాంది పలికింది. ఇప్పుడు డేటా వినియోగం, డిజిటల్ వృద్ధిని దెబ్బతీయని విధంగా టారిఫ్ పెంచుతామని తాజాగా ప్రకటించింది.
ఆర్పు పెరుగుతుంది
మూడు టెల్కోలు ధరలు పెంచుతామని చెప్పిన అనంతరం షేర్ ధరలు పెరిగాయి. బుధవారం వొడాఫోన్ ఐడియా షేర్ 17.5 శాతం పెరిగి రూ.7.07, ఎయిర్ టెల్ షేర్ 437కు చేరుకుంది. రిలయన్స్ జియో షేర్ 2.47 శాతం పెరిగి రూ.1,547కు చేరుకుంది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఆర్పు (ARPU) FY22కి వరుసగా 55 శాతం పెరిగి రూ.198కి, రూ.166కు చేరుకుంటుందని క్రెడిట్ స్యూసీ అంచనా వేసింది. సెప్టెంబర్ క్వార్టర్లో వీటి ఆర్పు వరుసగా రూ.128, 107గా ఉంది.
వాయిస్ కాల్, డేటా ఛార్జీలు పెరుగుతున్నాయి.. గుడ్ న్యూస్!
వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ తర్వాత జియో కూడా టారిఫ్ పెంచేందుకు నిర్ణయించిన నేపథ్యంలో టెలికం పరిశ్రమ ఊహించిన దాని కంటే ఎక్కువగా పరుగులు పెడుతుందని అంచనా వేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ప్రస్తుతం ఆధిపత్యం చలాయిస్తున్న ఈ మూడు ప్రయివేటు కంపెనీలు కూడా టారిఫ్ పెంచాలని నిర్ణయం తీసుకోవడం సానుకూలమైన అంశమని, ఇంతకాలం ఈ రంగంపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుందని అమెరికా బ్రోకరేజ్ సంస్థ తెలిపింది.
టెలికం రంగానికి ఊరట..
టెలికం రంగంపై రూ.7 లక్షల రుణ భారం ఉందని, ఇప్పుడు అధిక టారిఫ్, ప్రభుత్వ సుంకాలు తగ్గడం వల్ల కోలుకుంటుందని పరిశ్రమ పునరుద్ధరణకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. జియో ధరలు పెంచిన తర్వాత వొడాఫోన్ ఐడియా , ఎయిర్టెల్ మరింత పెంచే అవకాశాలు కూడా ఉంటాయి.
20 శాతం పెరిగితే తప్ప..
టారిఫ్ రేటును 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంచాల్సిందిగా స్వయంగా టెలికాం శాఖనే కంపెనీలకు సూచించినట్లు తెలుస్తోందని కూడా వార్తలు వచ్చాయి. ఈ పెంపును కేవలం సంస్థలు, ఇనిస్టిట్యూషన్స్ వంటి వాణిజ్య కస్టమర్లకు మాత్రమే వర్తింపజేయవచ్చని చెబుతున్నారు. సాధారణ కస్టమర్లకు కూడా కొంత మేర భారం తప్పకపోవచ్చునని అంటున్నారు. వాయిస్ కాల్, డేటా ఛార్జీని ఏమేర పెంచనున్నాయనే దానిపై కంపెనీలు వచ్చే వారంలో స్పష్టతను ఇవ్వవచ్చు. ప్రస్తుత చార్జీలపై కనీసం 20% పెంచితే తప్ప మనుగడ లేదని జెఫ్రీస్ ఫైనాన్షియల్ గ్రూప్ ఈక్విటీ నిపుణుల అభిప్రాయం. టెలికం ఛార్జీలు పెరిగితే వైర్ లెస్ కనెక్షన్ల సంఖ్య కొంత తగ్గవచ్చునని, ప్రతి నెల మొబైల్ కనెక్షన్ల పెరుగుదల రేటు కూడా మందగించవచ్చునని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలీంచ్ పేర్కొంది.