సెటిల్మెంట్ ప్యాకేజీ కింద మాల్యా భారీ ఆఫర్.. ఇంతకీ ఇదైనా చెల్లిస్తాడా..?
న్యూఢిల్లీ: భారత్లో పలు బ్యాంకుల వద్ద వేల కోట్లు రుణాలుగా పొంది వాటిని ఎగవేసి బ్రిటన్కు పారిపోయిన ఆర్థిక నేరగాడు లిక్కర్ బ్యారన్ విజయ్మాల్యా చాలా రోజుల తర్వాత వార్తల్లో నిలిచాడు. మాల్యా తరపున భారత్లో సుప్రీంకోర్టులో వాదిస్తున్న న్యాయవాది ఒక ప్రతిపాదన ఉంచారు. బ్యాంకుల వద్ద పొందిన రుణాన్ని మొత్తంగా కాకపోయినప్పటికీ ఒక ప్యాకేజీ పద్ధతిలో డబ్బులు చెల్లిస్తానని అత్యున్నత న్యాయస్థానంకు తెలిపారు మాల్యా తరపున న్యాయవాది. ఈ ప్రతిపాదనకు ఓకే చెబితే తనపై ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ కేసులు ఒక కొలిక్కి వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.
రూ.13,960 కోట్లు ఆఫర్ చేసిన మాల్యా
మాల్యా కేసును చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేసింది. మాల్యా చెప్పినట్లు ప్యాకేజీ కింద ఎంత మొత్తం చెల్లిస్తారో ఆ సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే రూ.13,960 కోట్లు ఒక ప్యాకేజీ కింద చెల్లించేందుకు మాల్యా అంగీకరిస్తూ గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మాల్యా దాదాపు రూ.9వేల కోట్లు రుణంగా వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నారు. మనీలాండరింగ్ కేసుల నుంచి బయటపడేందుకు మాల్యా ఈ స్థాయిలో డబ్బులు చెల్లించాలని పేర్కొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.
భారత్కు మాల్యా.. హింట్ ఇచ్చిన సాల్సిటర్ జనరల్
మాల్యా ఎప్పటికప్పుడు ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం అలవాటుగా చేసుకున్నారని ప్రభుత్వం తరపున వాదించిన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. భారత్కు వచ్చే ముందు మాల్యా ఈ డబ్బులను డిపాజిట్ చేయాలని చెప్పారు. తుషార్ మెహతా వ్యాఖ్యలతో మాల్యా త్వరలోనే భారత్కు రానున్నట్లు తెలుస్తోంది. భారత్లో భారీగా రుణాలు పొంది ఎగవేసి 2016లో యూకేకు పారిపోయాడు. ఇక అప్పటి నుంచి భారత్ కూడా అతన్ని భారత్కు రప్పించేందుకు పలు ప్రయత్నాలు చేసి చివరకు అక్కడి కోర్టుల్లో విజయం సాధించింది. అయితే ఇప్పుడు తనకు ఆశ్రయం కల్పించాలంటూ యూకేని కోరాడు మాల్యా.
|
ఇప్పటికే నాన్బెయిలబుల్ వారెంట్
ఢిల్లీ కోర్టు మాల్యాకు 2016లో నాన్-బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఈడీ కేసులో పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఇక తన ఆస్తుల వివరాలను వెల్లడించనందుకు సుప్రీంకోర్టు కూడా విజయ్ మాల్యాపై ఆగ్రహం వ్యక్తంచేసింది. 2016 మార్చిలో రూ.4వేల కోట్లు డిపాజిట్ చేస్తానని ప్రకటించాడు. ఇందులో అప్పటి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కు సంబంధించిన కేసు కూడా ఉంది. ఆ తర్వాత నెలకే రూ.6,868 కోట్లు చెల్లిస్తానంటూ ప్రకటించాడు. ఈ మధ్యనే కోవిడ్-19 పోరుకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీపై అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు మాల్యా. డబ్బులు చెల్లిస్తానని చెబుతున్నప్పటికీ తనను మాత్రం ప్రభుత్వం విస్మరిస్తోందని తాను ఇచ్చే డబ్బులను తీసుకుని తనపై ఉన్న కేసులను మాఫీ చేయాలంటూ ట్వీట్ చేశాడు.