VG Siddhartha biopic: టీ-సిరీస్కు హక్కులు: టైటిల్ ఇదే
ముంబై: కేఫ్ కాఫీ డే. కాఫీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్లు అవి. నగరాల్లో ఈ పేరు తెలియని వారు దాదాపు ఉండరు. దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. విదేశాల్లోనూ కేఫ్ కాఫీ డే రెస్టారెంట్లు ఉన్నాయి. బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్ను నమోదు చేస్తోన్నాయి ఈ కాఫీ రెస్టారెంట్స్. ఆ రెస్టారెంట్ల ఛైర్మన్, దివంగత వీజీ సిద్ధార్థ బయోపిక్ తెరకెక్కబోతోంది.
ఆత్మహత్య చేసుకున్న సిద్ధార్థ..
సక్సెస్ఫుల్ ఇండస్ట్రీయలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ.. 2019లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పారిశ్రామికవర్గాలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అటు రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది.
మారణానంతరం..
వీజీ సిద్ధార్థ.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ అల్లుడు. సిద్ధార్థకు కర్ణాటకలోని చిక్ మగళూరు జిల్లాలో తేయాకు ఎస్టేట్ ఉంది. ఆసియాలోనే అతిపెద్ద తేయాకు తోట అది. దీని ద్వారా వచ్చే టీ, కాఫీలతోనే ఆయన కేఫ్ కాఫీ డే రెస్టారెంట్లను నడిపించారు. సిద్ధార్థ మరణానంతరం ఆయన భార్య మాళవిక కృష్ణ హెగ్డే.. వాటిని పర్యవేక్షిస్తోన్నారు.
పాన్ ఇండియా మూవీగా..
ఇప్పుడు తాజాగా వీజీ సిద్ధార్థ బయోపిక్ తెరకెక్కబోతోంది. ఆయన జీవిత చరిత్ర మీద సినిమా రాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ టీ-సిరీస్ దీనికి సంబంధించిన హక్కులను కొనుగోలు చేసింది. పాన్ ఇండియా మూవీ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానుంది టీ-సిరీస్.
|
టీ సిరీస్ నిర్మాణ సారథ్యంలో..
కాఫీ కింగ్: ది స్విఫ్ట్ రైజ్ అండ్ సడెన్ డెత్ ఆఫ్ కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ అనే పేరు మీద ముద్రితమైన పుస్తకంపై టీ-సిరీస్ సర్వహక్కులను కొనుగోలు చేసింది. టీ-సిరీస్, ఆల్మైటీ మోషన్ పిక్చర్ చీఫ్ ప్రభ్లీన్ కౌర్ సంధు, కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించనున్నాయి.
ఆ బుక్ ఆధారంగా..
ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రుక్మిణి బీఆర్, ప్రొసేన్ జిత్ దత్త ఈ బుక్ను రాశారు. ప్రముఖ పబ్లిషింగ్ హౌస్ పాన్ మెక్మిల్లన్ ఈ పుస్తకాన్ని ముద్రించింది. ఇది ఇంకా మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది. పాన్ మెక్మిల్లన్ కూడా వీజీ సిద్ధార్థ జీవిత కథపై సినిమాను తెరకెక్కించనుంది. ఈ విషయాన్ని ఇదివరకే ప్రకటించిందా పబ్లిషింగ్ హౌస్.
విజయవంతమైన పారిశ్రామికవేత్త..
వీజీ సిద్ధార్థ బయోపిక్ విషయాన్ని టీ-సిరీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ ధృవీకరించారు. ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు చెప్పారు. దేశంలోనే అతి పెద్ద రిటైల్ చెయిన్ రెస్టారెంట్లను నెలకొల్పిన ఓ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీయలిస్ట్ కథను ప్రతి ఒక్కరికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రజలకు మరింత వివరంగా..
ఆయన జీవితం అత్యంత విషాదకరంగా ముగియడానికి గల కారణాలను ఇందులో చర్చిస్తామని చెప్పారు. వీజీ సిద్ధార్థ జీవితంలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయని, వాటిని ఈ బుక్లో వివరించామని రుక్మిణి బీఆర్, ప్రొసేన్ జిత్ దత్తా పేర్కొన్నారు. ప్రజలకు మరింత వివరంగా తెలియజేయడానికే బయోపిక్ను నిర్మించాలని నిర్ణయించినట్లు కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్ చీఫ్ శైలేష్ ఆర్ సింగ్ చెప్పారు.