టార్గెట్ 2022: యూపీలో బిగ్ ప్రాజెక్ట్: రూ.5 వేల కోట్ల పీఎన్బీ లోన్
లక్నో: ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. కొన్ని జాతీయ ప్రాజెక్టులను ప్రకటించింది. దీనికోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా ఉత్తర ప్రదేశ్కు వెళ్లారు. లక్నోలో మకాం వేశారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్, బీజేపీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో వరుస భేటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ప్రాజెక్టులను నిర్మల సీతారామన్ ప్రారంభించారు.
5,100 కోట్ల రూపాయలతో..
ఇందులో భాగంగా- గంగా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ కోసం 5,100 కోట్ల రూపాయల రుణాన్ని ఇప్పించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ రుణాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి మంజూరు చేసింది. గంగా ఎక్స్ప్రెస్ వే కోసం ఇన్ని వేల కోట్ల రూపాయల మొత్తాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్.. సెక్యూరిటైజేషనల్ లోన్ కింద ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించింది. వడ్డీతో సహా ఈ రుణాన్ని తిరిగి పంజాబ్ నేషనల్ బ్యాంక్కు చెల్లించడానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వాహనాలదారులపై ఆధారపడుతుంది.
యోగిపై ప్రశంసలు..
ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాల నుంచి టోల్ గేట్లు, ఇతర మార్గాల ద్వారా దీన్ని వసూలు చేస్తుంది. ఈ మొత్తాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి విడుదల చేయడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిథిగా నిర్మల సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కొన్ని కీలక ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు.
దేశ ప్రయోజనాల కోసం..
జాతీయ భావాలతో యోగి ఆదిత్యనాథ్ పని చేస్తోన్నారని, దాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం పాలసీల రూపంలో బదలాయిస్తోన్నారని అన్నారు. రక్షణశాఖకు సంబంధించినంత వరకు కొన్ని ప్రాజెక్టులను ఉత్తర ప్రదేశ్కు మంజూరు చేసే విషయంలో తొలుత తాను కొంత సంకోచించానని, ఆ తరువాత యోగి ఆదిత్యనాథ్ పనితీరును చూసి సంతృప్తి కలిగిందని అన్నారు. డిఫెన్స్ కారిడార్ను ఉత్తర ప్రదేశ్కు మంజూరు చేయడం సరైన నిర్ణయమేనని నిర్మల సీతారామన్ వ్యాఖ్యానించారు.
ఎంఎస్ఎంఈలకు స్వర్గధామం..
తమిళనాడు, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాల్లో పారిశ్రామికీకరణకు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, అదే సమయంలో ఉత్తర ప్రదేశ్ వ్యవసాయ రంగానికి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు స్వర్గధామంలా మారిందని పేర్కొన్నారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ రాష్ట్రానికి పశ్చిమం వైపున ఉన్న మీరట్ తూర్పు దిక్కున ఉన్న ప్రయాగ్రాజ్ను అనుసంధానించేలా గంగా ఎక్స్ప్రెస్ వేను నిర్మిస్తున్నామని అన్నారు.
గంగా ఎక్స్ప్రెస్ వే
దీనికోసం 93 శాతం భూసేకరణ పనులు పూర్తయినట్లు చెప్పారు. మొత్తం 594 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించడానికి ప్రస్తుతం ఆరున్నర గంటల సమయం పడుతోందని, ఈ ఎక్స్ప్రెస్ వే వల్ల అది అయిదు గంటలకు దిగుతుందని అన్నారు. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వే నిర్మాణ పనులు పూర్తయ్యాయని చెప్పారు.
నిర్దేశిత గడువులోగా దీన్ని పూర్తి చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఎంతగానో సహకరించారని అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్లో నిధులను కేటాయించారని చెప్పారు. మిషన్ శక్తి మూడో విడత కార్యక్రమాన్ని నిర్మల సీతారామన్ ప్రారంభించారు. లక్నోలోని రాజ్భవన్లో గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యోగి ఆదిత్యనాథ్తో కలిసి దీన్ని లాంచ్ చేశారు.