వాహనదారులకు గుడ్న్యూస్.. ఎంత వినియోగిస్తే అంతకే బీమా!
వాహనాలకు బీమా తప్పని సరిగా మారిన నేపథ్యంలో ఒకటికి మించి వాహనాలు ఉన్న వారు తమ వాహనాన్ని తక్కువ వాడుతున్నప్పటికీ బీమా చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల వారిపై భారం పెరుగుతుంది. బీమా ప్రీమియం మొత్తం ఏటా పెరుగుతున్న కారణంగా పాలసీ తీసుకునే వారిపై భారం ఎక్కువ అవుతోంది. దీన్ని తగ్గించడానికి భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) తీవ్రమైన కసరత్తు చేసింది. సాండ్ బాక్స్ కింద తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వాహనాన్ని ఎంత మేరకు వినియోగిస్తే అంత ప్రీమియం చెల్లించే పాలసీలను తీసుకు రావాలని బీమా కంపెనీలకు సూచించింది. ఈ నేపథ్యంలో వినియోగ ఆధారిత బీమా పాలసీలను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా....
ఈ క్వార్టర్లో భారీగానే షాకిచ్చిన బంగారం ధర, ఫ్యూచర్ తగ్గుదల
ఆ కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని..
* సాధారణ బీమా కంపెనీలైన లిబర్టీ జనరల్ ఇన్సూరెన్సు, ఐసీఐసీఐ లంబార్డ్ తో పాటు మరికొన్ని కంపెనీలు కూడా వినియోగ ఆధారిత బీమా సదుపాయాన్ని తమ ప్రస్తుత ప్రైవేట్ కార్ ప్యాకేజీ పాలసీల్లో అందిస్తున్నాయి.
* వినియోగ ఆధారిత మోటార్ ఇన్సూరెన్సు పాలసీలు సాంప్రదాయ మోటార్ ఇన్సూరెన్సు తో పోల్చితే భిన్నంగా ఉంటాయి. ఇలాంటి పాలసీల వల్ల బీమా వ్యాప్తి మరింతగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
* తక్కువగా వాహనాన్ని వాడుతున్నారంటే తక్కువగా ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సందర్భంలో సంబంధిత వాహనదారుల నుంచి క్లైమ్స్ ఎక్కువగా రావు. దీనివల్ల బీమా కంపెనీలపై ఆర్థికంగా భారం ఉండదు. ప్రీమియం తక్కువగా ఉంటుంది కాబట్టి వాహనదారులపైన భారం ఉండదు.
* ప్రస్తుతం అందిస్తున్నది పాలసీలో ఓన్ డ్యామేజీ భాగానికి వర్తిస్తుంది.
* నిర్దేశిత కిలోమీటర్లు దాటినా తర్వాత ఓడీ కవరేజీని పెంచుకోవడానికి టాప్ అప్ సదుపాయాన్ని వినియోగించుకొని అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
దూరం లెక్కింపు ఎలాగంటే?
* వాహనదారుడు పాలసీని పొందే సమయంలో తన వాహనానికి సంబంధించిన ఓడోమీటర్ లోని రీడింగ్ ను తెలియజేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ సందర్భంలో ఇదే పాలసీ షెడ్యూలు లో ఉంటుంది. ఒకవేళ ప్రమాదం జరిగితే ఓడోమీటర్ రీడింగ్ను బట్టి క్లెయిమ్ కు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని కొత్త కార్లకు టెలీమాట్రిక్స్ టెక్నాలజీ ఆధారంగా వివరాలు సేకరిస్తారు.
* దూరం ఆధారంగా తీసుకునే పాలసీల ద్వారా పాలసీ దారులకు బాగానే ప్రీమియం సొమ్ము ఆదా అయ్యే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
* ఏడాది కాలంలో పదివేల లోపు కిలోమీటర్లు తిరిగే వారికి తక్కువ మొత్తంలోనే బీమా పాలసీ లభిస్తుందని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం చెల్లిస్తున్న ప్రీమియంకన్నా సగం వరకు తక్కువకు లభించవచ్చని కూడా అంటున్నారు.
* ఎక్కువ వాహనాలు ఉండి తక్కువగా వినియోగిస్తుంటే అలాంటి వారు వారు ప్రీమియం భారాన్ని తగ్గించుకునే అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు.