Salesforce: ఉద్యోగులపై సేల్స్ఫోర్స్ వేటు.. వేల మందిని పీకేసిన మార్క్ మామ..!
Salesforce: మాంద్యం అంచున ఉన్న అమెరికాలో టెక్ కంపెనీలు దయనీయ స్థితిలో ఉన్నాయి. తాజాగా యూఎస్ సాఫ్ట్ వేర్ కంపెనీ సేల్స్ ఫోర్స్ కూడా తన ఉద్యోగులపై వేటు వేసింది. ఇదే క్రమంలో మరో టెక్ దిగ్గజం ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా సైతం ఈరోజు నుంచి ఉద్యోగుల కోత ప్రారంభించింది. ఖర్చులను తగ్గించుకునేందుకే రెండు కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నట్లు ప్రకటిచాయి.
|
సేల్స్ఫోర్స్ ప్రకటన..
కంపెనీ సేల్స్ రెస్పాన్సిబిలిటీని పెంచుతోందంని, అయితే.. దురదృష్టవశాత్తూ అది కొంతమంది వ్యాపారాన్ని విడిచిపెట్టడానికి దారి తీస్తోందని అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కంపెనీ FY26 నాటికి $50 బిలియన్ల ఆదాయాన్ని పొందుతుందని గత నెలలో జరిగిన ఇన్వెస్టర్ డే ప్రెజెంటేషన్లో CFO అమీ వీవర్ అన్నారు. ఈ క్రమంలో 25% ఆపరేటింగ్ మార్జిన్ని లక్ష్యంగా చేసుకుని లాభదాయకతను పెంచాలని చూస్తున్నట్లు తెలిపారు. అయితే దానిని చేరుకోవటానికి ఖర్చులను తగ్గించాలని యోచిస్తున్నట్లు అప్పట్లో వెల్లడించారు. దీంతో తాజాగా కంపెనీ 1000 మందని తొలగించింది.
మెటా భారీ తొలగింపు..
మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్బర్గ్ నవంబర్ 9, 2022 నుంచి ఉద్యోగులను తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్లు ఈ వారం వెల్లడించారు. తాజాగా ఈ కాస్ట్ కట్టింగ్ ప్లాన్ లో భాగంగా 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించటం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కంపెనీ ప్రస్తుత ఉద్యోగుల్లో దాదాపు 13 శాతంగా ఉంది. సమర్థవంతమైన కంపెనీగా మారేందుకు మరిన్ని చర్యలు ఉంటాయని మార్క్ జుకర్బర్గ్ తెలిపారు. ముఖ్యంగా డిజిటల్ ప్రకటనల ఆదాయంలో తీవ్ర మందగమనం ఉండటంతో కంపెనీ ఈ చర్య తీసుకోవాల్సి వచ్చినట్లు తెలిపారు.
తొలగించిన వారికి ప్రయోజనాలు..
మెటా తొలగించబడిన ఉద్యోగులకు 6 వారాల బేసిక్ జీతాన్ని చెల్లిస్తోంది. ఇదే క్రమంలో ఉద్యోగులకు 6 నెలల పాటు ఆరోగ్య సంరక్షణ ఖర్చులు అందించనున్నట్లు స్పష్టం చేసింది. జుకర్బర్గ్ మెటాను మరింత సమర్థవంతమైన మూలధనంగా మార్చడంపై దృష్టి సారించారు. అయితే గతంలో వృద్ధిపై అధిక ఆశావాహంగా ఉన్నందున అప్పట్లో కంపెనీ భారీగా సిబ్బందిని నియమించుకుంది. ఇదే సమయంలో మార్క్ డ్రీమ్ ప్రాజెక్ట్ మెటావర్స్ వేల డాలర్లను హరించివేయటం, లాభాల బాట పట్టకపోవటం కంపెనీ ఆర్థికతపై తీవ్ర ప్రభావం చూపిందని నిపుణులు చెబుతున్నారు.
విలవిల్లాడుతున్న వాల్ స్ట్రీట్..
టెక్ ఆధారిత కంపెనీలు వరుసగా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించటంతో వాల్ స్ట్రీట్ వళికిపోతోంది. చాలా మంది ఇన్వెస్టర్లు తమ డబ్బును టెక్ కంపెనీల నుంచి తొలగిస్తున్నారు. ఇది అమెరికా మార్కెట్లలో కంపెనీల విలువ కోల్పోవటానికి కారణంగా నిలిచింది. దశాబ్దాలుగా కంపెనీలు ఎన్నడూ చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా.. పరిస్థితులు అదుపులోకి రాకుంటే యాజమాన్యాలు మరింత నిర్థయగా మారతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, గూగుల్ తో పాటు అనేక సిలికాన్ వ్యాలీ కంపెనీలు ఉద్యోగుల మెడపై కత్తి పెడుతున్నాయి.