Intel: తగ్గిన అమ్మకాలు.. తలకిందులైన అంచనాలు.. ఉద్యోగులను ఇంటికెళ్లిపొమ్మంటున్న ఇంటెల్..!
Intel Firing: మాంద్యం మెల్లగా అన్ని రంగాలపై ప్రభావం చూపించటం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎక్కువగా ఐటీ రంగంలో కనిపించిన స్లోడౌన్ ఇతర రంగాలకు పాకుతోంది. తాజాగా అమెరికా దిగ్గజ కంపెనీ ఇంటెల్ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించటానికి రంగం సిద్ధం చేసుకుంటోది. ప్రస్తుతం ఈ వార్తలు ప్రపంచాన్ని అతలా కుతలం చేస్తోంది.
మందగమనంతో..
ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వ్యాప్తంగా మందగించటంతో చేసేదేం లేక కంపెనీలు ఖర్చుల భారీన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో చిప్ మేకింగ్ దిగ్గజం ఇంటెల్ కార్ప్.. పర్సనల్ కంప్యూటర్ మార్కెట్ నెమ్మదించటంతో ఉద్యోగుల కోతకు ప్లాన్ చేస్తోంది.
వేలల్లో కోతలు..
ప్రస్తుత సమాచారం ప్రకారం ఉద్యోగుల తొలగింపు వేల సంఖ్యలోనే ఉంటుందని తెలుస్తోంది. మెుత్తం సిబ్బందిలో కనీసం 20 శాతం మంది తొలగింపు ఉండవచ్చని ఇంటెల్ గ్రూప్ సంకేతాలిస్తోంది. హెడ్కౌంట్ తగ్గించటం వల్ల రెవెన్యూలపై ప్రభావాన్ని తగ్గించుకోవాలని యోచిస్తున్నట్లు ఈ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తులు బ్లూమ్బెర్గ్ వార్తా సంస్థకు తెలిపారు.
జూలై లెక్కల ప్రకారం..
జూలై లెక్కల ప్రకారం 1,13,700 మంది ఉద్యోగులను ఇంటెల్ కలిగి ఉంది. తాజా నిర్ణయం వల్ల దాదాపు 20 వేల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. రెండో త్రైమాసికంలోను ఫలితాలు అంచనాలను అందుకోకపోవటంతో జూలైలో.. వార్షిక అమ్మకాలు, లాభాల అంచనాలను సంస్థ ఇప్పటికే తగ్గించుకుంది. పీసీల మార్కెట్ వీక్ కావటానికి ద్రవ్యోల్బణం, కరోనా వంటివి కారణాలుగా నిలుస్తున్నాయి.
చైనా కారణంగా..
ప్రధాన మార్కెట్ గా ఉన్న చైనాలో కరోనా ఆంక్షలు కంపెనీ అంచనాలను తారుమారు చేస్తున్నాయి. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్ వివాదం వంటివి పరోక్షంగా కారణం అవుతున్నాయి. పైగా అధిక ద్రవ్యోల్బణం వల్ల ప్రజలు ఖరీదైన వస్తువుల కొనుగోళ్లకు దూరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంటెల్ ప్రధానంగా ఇప్పటివరకు స్వయంగా రూపొందించిన చిప్లను తయారు చేసింది. అయితే రానున్న రోజుల్లో ఇతర రంగాలు సైతం ఇదే బాట పడతాయో లేక తిరిగి పుంజుకుంటాయో వేచి చూడాల్సిందే.