70 రెట్లు పెరిగిన యూపీఐ ట్రాన్సాక్షన్స్, కరెన్సీ చలామణి ఎందుకు పెరిగిందంటే?
నోట్ల రద్దు తర్వాత గత అయిదేళ్ల కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వేగంగా పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ 70 శాతం పెరిగాయి. అయితే డిజిటల్ రెవెల్యూషన్కు అనుగుణంగా రెగ్యులేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నివేదిక తెలిపింది. ఏ గైడ్ టు ఫార్మాలైజేషన్ ఆఫ్ ఎకానమి సిన్స్ FY2018 పేరుతో స్బీఐ రీసెర్చ్ నివేదిక వచ్చింది. దీపావళి పండుగ సమయంలో రికార్డ్ స్థాయిలో రూ.1.25 లక్షల కోట్ల కొనుగోళ్లు జరిగాయి.
అయితే గత ఏడాదితో పోలిస్తే కరెన్సీ సర్క్యులేషన్ దాదాపు స్థిరంగా ఉంది. 2016లో నోట్ల రద్దు విషయం తెలిసిందే. అప్పటి నుండి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వేగవంతమయ్యాయి. అయితే మనీ సర్క్యులేషన్ కూడా ఎక్కువే ఉంది. కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వేగంగా పెరిగాయి.
జీడీపీ మైనస్లోకి వెళ్ళకుంటే..
జీడీపీలో మనీ సర్క్యులేషన్ పరిమాణం 13.1 శాతానికి చేరుకుంది. 2016లో నోట్ల రద్దు ప్రకటించిన సమయంలో జీడీపీలో మనీ సర్క్యులేషన్ పరిమాణం కనిష్ఠస్థాయి 8.7 శాతాన్ని నమోదు చేసింది. 2021 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠస్థాయి 14.5 శాతానికి చేరుకుంది. గత అయిదేళ్ల కాలంలో ఆర్థిక రంగంలో 80 శాతం వ్యవస్థీకృతమైందని తెలిపింది.
కరోనాతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవడం, జీడీపీ దేశచరిత్రలో తొలిసారి మైనస్ 7.3 శాతానికి క్షీణించడం 2020-21లో నగదు ట్రాన్సాక్షన్స్ 14.5 శాతానికి చేరుకోవడానికి కారణమని తెలిపింది. జీడీపీ ఇంత భారీగా పతనం కాకపోతే మనీ సర్క్యులేషన్ వాటా 12.7 శాతం వరకు మాత్రమే ఉండేదని పేర్కొంది. కరోనా కాలంలో ముందు జాగ్రత్తతో ప్రజలు రూ.3.3 లక్షల కోట్ల నగదును చేతిలో అట్టిపెట్టుకున్నట్లు తేలింది. జీడీపీలో పన్నుల శాతం పెరగడమే ఆర్థిక రంగం వ్యవస్థీకృతమనేందుకు నిదర్శనం అంటున్నారు.
2008-10 ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీలో నగదు చలామణి 12.1 శాతం, 12.5 శాతం, 12.4 శాతంగా ఉంది. 2011-201 మధ్య 12.4 శాతం కాగా, 11.4 శాతం కనిష్టం. 2016లో 8.7 శాతానికి తగ్గింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2021 అక్టోబర్ నాటికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల వ్యాల్యూ రూ.29.17 లక్షల కోట్లు.
యూపీఐ జోరు.. డెబిట్ కార్డు బేజారు
అక్టోబర్ నెలలో యూపీఐ చెల్లింపులు రూ.6.3 లక్షల కోట్లు నమోదయ్యాయి. 2020 ఇదే నెలతో పోలిస్తే ఇది 103 శాతం అధికం. 2017 నుండి యూపీఐ ట్రాన్సాక్షన్స్ 69 శాతం పెరిగాయి. 2017లో రూ.1700 కోట్లుగా ఉన్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ 2021 నాటికి రూ.1,17,100 కోట్లకు చేరుకున్నాయి.
ఓ వైపు యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెరుగుతుండటంతో డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ తగ్గాయి లేదా స్థిరంగా ఉన్నాయి. డెబిట్ కార్డు కొనుగోళ్లు 2020లో రూ.13,800 కోట్లు కాగా, 2021లో ఇప్పటి వరకు రూ.9700 కోట్లు మాత్రమే నమోదయ్యాయి.
క్రెడిట్ కార్డ్ కొనుగోళ్ల జోరు
ప్రస్తుత ఏడాది ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనుగోళ్లు రూ.13,300 కోట్లకు చేరుకున్నాయి. 2020లో క్రెడిట్ కార్డ్స్ వాడకంతో రూ.13500 కోట్ల ట్రాన్సాక్షన్స్ నిర్వహించగా, ఈ ఏడాది ఇప్పటికే ఈ స్థాయికి చేరువైంది. కాబట్టి క్రెడిట్ కార్డు కొనుగోళ్లు గత ఏడాదితో పోలిస్తే పెరగనున్నాయి. 2012లో క్రెడిట్ కార్డ్ ద్వారా ఖర్చు రూ.1500 కోట్లు కాగా, 2018 నాటికి రూ.10,100 కోట్లు, ఇప్పుడు రూ.13,000 కోట్లకు చేరుకుంది.