మోడీ సర్కార్పై ఆశల్లేవా: కరోనా వ్యాక్సిన్ కోసం యోగి ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు
లక్నో: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న కల్లోలం అంతా ఇంతా కాదు. కనీవినీ ఎరుగని ఉత్పాతానికి దారి తీసిందీ మహమ్మారి. దేశాన్ని కరోనా సెకెండ్ వేవ్ దారుణంగా దెబ్బ కొడుతోంది. జనం ఉసురు తీస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా మరణాలకు కారణమౌతోంది. వరుసగా మరోసారి కూడా నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. యాక్టివ్ కేసులు 37,23,446గా రికార్డయ్యాయి. మరోవంక కరోనా వ్యాక్సిన్ల కొరత దేశాన్ని వెంటాడుతోంది. తొలి డోసు వేసుకున్న వారు రెండో డోసు కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.
వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు..
వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి అనేక రాష్ట్రాల్లో నెలకొంది. చాలినన్ని టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల పలు రాష్ట్రాలు మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఉత్పాదక సంస్థలకు ఆర్డర్లు ఇచ్చినప్పటికీ.. డిమాండ్కు అనుగుణంగా సరఫరా ఉండట్లేదు. రాష్ట్రాలే వ్యాక్సిన్ను సమకూర్చుకోవాల్సి ఉంటుందంటూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా తేల్చేయడంతో.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిించాల్సి వస్తోంది.
గ్లోబల్ టెండర్లు..
ఇందులో భాగంగా- ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ ఇటెండర్లను పిలిచింది. బిడ్డింగులను ఆహ్వానించింది. ఆరు నెలల వ్యవధిలో 40 మిలియన్ డోసుల వ్యాక్సిన్ను గ్లోబల్ టెండర్ల ద్వారా సమీకరించుకోవాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించుకుంది. మైనస్ రెండు డిగ్రీల నుంచి మైనస్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్లను నిల్వ ఉంచుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. వ్యాక్సిన్ సరఫరా కాంట్రాక్ట్ను పొందే వారు ప్రతినెలా తమ రాష్ట్రానికి కనీసం ఆరు మిలియన్ల డోసుల వ్యాక్సిన్ను సరఫరా చేయాల్సి ఉంటుందంటూ స్పష్టం చేసింది.
12న ప్రీబిడ్డింగ్ మీటింగ్..
76 పేజీల టెండర్ డాక్యుమెంట్లను యూపీ ప్రభుత్వం జారీ చేసింది. ఈ పనులన్నింటినీ ఉత్తర ప్రదేశ్ మెడికల్ సప్లయ్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీఎంఎస్సీఎల్) పర్యవేక్షిస్తుంది. ఉత్తర ప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ఆధీనంలో ఉండే కార్పొరేషన్ ఇది. ఈ నెల 12వ తేదీన గూగుల్ మీట్ ద్వారా ప్రీబిడ్డింగ్ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ టెండర్ల క్లోజింగ్ తేదీ ఈ నెల 21. అప్పటిలోగా 16 కోట్ల రూపాయలను జమ చేస్తుందా కార్పొరేషన్. ఈ ఏడాది చివరి నాటికి కనీసం 40 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను సమీకరించుకోవాలనేది యోగి సర్కార్ లక్ష్యం.
మహారాష్ట్ర కూడా
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన తొలి రాష్ట్రం ఇదే. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్లను సమీకరించుకోవడానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించనుంది. వ్యాక్సిన్లతో పాటు రెమ్డెసిివిర్ ఇంజెక్షన్లను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ద్వారా సమీకించుకోబోతోంది. దీనికి అవసరమైన టెండర్ల ప్రక్రియను ఇంకా చేపట్టలేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. డిమాండ్కు అనుగుణంగా వ్యాక్సిన్ల లభ్యత లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని సమీకరించుకోవాల్సి వస్తోందంటూ అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది.