5జీ.. రానుంది: స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్: 20 ఏళ్లు
న్యూఢిల్లీ: దేశంలో 5జీ నెట్వర్క్ ఇక అందుబాటులోకి రానుంది. 5జీ సర్వీసుల కోసం ఉద్దేశించిన స్పెక్ట్రమ్ వేలం వేయడానికి కేంద్ర మంత్రివర్గం కొద్దిసేపటి కిందటే ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన దేశ రాజధానిలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. పలు కీలక అంశాలు ఈ భేటీ సమక్షానికి వచ్చాయి.
డీఓటీకి అనుమతి..
ఇందులో ఒకటి- 5జీ స్పెక్ట్రమ్ వేలం. ఈ వేలాన్ని నిర్వహించడానికి టెలికా మంత్రిత్వ శాఖకు కేంద్ర మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. 4జీతో పోల్చుకుంటే 10 రెట్ల వేగం ఉంటుంది 5జీకి. 20 సంవత్సరాల పాటు కాల పరిమితితో దీన్ని నిర్వహిస్తుంది టెలికాం శాఖ. 72097.85 మెగా హెర్ట్జ్ సామర్థ్యం గల స్పెక్ట్రమ్ 5జీని అందుబాటులోకి తీసుకుని రానుంది.
నెలరోజుల్లో పూర్తి..
ఈ వేలం పాట ప్రక్రియ మొత్తం ఈ నెలాఖరులో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో దీన్ని ముగించాలని టెలికాం మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. జులై చివరి నాటికి స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ పూర్తవుతుందని డీఓటీ ఓ నోటిఫికేషన్లో వెల్లడించింది. మొత్తం మూడు ఫ్రీక్వెన్సీల్లో ఈ వేలంపాటలు ఉంటాయి.
మూడు ఫ్రీక్వెన్సీల్లో..
లో- రేంజ్ అంటే.. 600, 700, 800, 900, 1800, 2100, 2300 మెగా హెర్ట్జ్, మిడ్ రేంజ్ అంటే.. 3300 మెగా హెర్ట్జ్, అలాగే హై రేంజ్ అంటే.. 26 గిగా హెర్ట్జ్ సామర్థ్యంతో ఈ స్పెక్ట్రమ్ వేలంపాట ఉంటుంది. మిడ్ అండ్ హై బ్యాండ్ స్పెక్ట్రమ్ను టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ వినియోగించుకునే అవకాశం ఉంది. 4జీతో పోల్చి చూస్తే 10 రెట్లు అధిక వేగంతో ఉండేలా దీన్ని స్పెక్ట్రమ్ ఉంటుందని అంచనాలు వ్యక్తమౌతున్నాయి.
పైలెట్ ప్రాజెక్టులు..
కాగా- టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా- 5జీని అమలు చేయడానికి పైలెట్ ప్రాజెక్టులను ఇదివరకే ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, భోపాల్, బెంగళూరు మెట్రో, గుజరాత్లోని ప్రఖ్యాత కాండ్లా దీన్ దయాళ్ పోర్ట్లను పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసింది.
రిలయన్స్ జియో..
దేశంలో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ కంపెనీగా గుర్తింపు పొందిన రిలయన్స్ జియో.. 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. వెయ్యి నగరాలను ఈ నెట్వర్క్ పరిధిలోకి తీసుకుని రానుంది. తొలి దశలో 5జీ నెట్వర్క్లో విస్తరింపజేయడానికి ప్రత్యేకంగా డెడికేటెడ్ సొల్యూషన్ టీమ్స్ను ఏర్పాటు చేసింది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.
అత్యాధునిక టెక్నాలజీతో..
నెట్వర్క్ ప్లానింగ్లో 3డీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీ వంటి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పైలెట్ ప్రాజెక్ట్స్ పూర్తయ్యాయి. అనుమతులు రాగానే.. దీన్ని ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రోల్ అవుట్ కోసం సంసిద్ధంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.