రూ.12 లక్షల కోట్ల అప్పులు చేయబోతోన్నాం: నిర్మలమ్మ: ఈ రెండు నెలల్లో 80 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఈ రెండు నెలల కాలానికి వేల కోట్ల రూపాయల మేర రుణాలను తీసుకోబోతోన్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఫిబ్రవరి, మార్చినెలల్లో ఆర్థిక లక్ష్యాను అందుకోవడానికి భారీగా అప్పులను తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒక్కో నెలకు 40 వేల కోట్ల రూపాయల చొప్పున రుణాలను తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని అన్నారు. మొత్తంగా 80 వేల కోట్ల రూపాయల అప్పులు చేయబోతోన్నామని స్పష్టం చేశారు.
2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్లో ప్రవేశపెడుతోన్న సందర్భంగా ఆమె ఈ ప్రకటన చేశారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో నెలకు లక్ష కోట్ల రూపాయల చొప్పున రుణాలను తీసుకోవాలని నిర్ణయించామని అన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం ఈ ప్రతిపాదనలను బడ్జెట్లో చేర్చామని తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి నాటికి అంటే.. 12 నెలల కాలానికి నెలకు లక్ష కోట్లు చొప్పున 12 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ ఏడాది కాలానికి 34.83 లక్షల కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని అంచనా వేశామని అన్నారు. ఇందులో 5.54 లక్షల కోట్ల రూపాయల మేర స్థూల పెట్టుబడుల కేటాయింపులు ఉన్నాయని ఆమె వివరించారు.
వ్యయానికి అనుగుణంగా రాబడి లేకపోవడం వల్లే రుణాలను తీసుకోదలిచామని తెలిపారు. దీనికి అనుగుణంగా తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని పేర్కొన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో 9.5 శాతం లోటు నెలకొందని, దీన్ని అందుకోవడానికి రుణాలను తీసుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తిలో ఈ ద్రవ్యలోటు 6.8 శాతంగా నమోదవుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు.