లాక్డౌన్ కారణంగా వస్తు-సేవల రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఇక దీని ప్రభావం మరో ఆరునెలల పాటు ఉండవచ్చని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నారు .
ఈ పరిశ్రమ , ఆ పరిశ్రమ అన్న తేడా లేకుండా అన్ని పరిశ్రమలు కుదేలయ్యాయి. ఊహించని కరోనా సంక్షోభంలో చిక్కుకున్నాయి . ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ఆర్ధిక సంక్షోభం ఏర్పడింది . కరోనాకు ఇప్పటి వరకు మెడిసిన్ లేకపోవటం , ఎక్కడికక్కడ కేసులు పెరగటం అన్ని వర్గాల మీద ప్రభావం చూపిస్తుంది. ప్రపంచమే లాక్ డౌన్ అయిన సందర్భం ముఖ్యంగా ఆర్ధిక వ్యవస్థ పతనం కొనసాగుతుంది.

అసలే ఆర్ధిక మందగమనం .. ఆపై కరోనాతో ఆర్ధిక సంక్షోభం
ఇక మన దేశం విషయానికి వస్తే కరోనా కంటే ముందే ఆర్ధిక మందగమనం కొనసాగుతుంది. ఆటోమొబైల్స్ , టెలికాం వంటి కొన్ని రంగాల్లో తిరోగమనం కొనసాగుతుంది. ఇక మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా కరోనా వైరస్ ప్రభావంతో నెలకొన్న లాక్ డౌన్ ఇప్పుడు మన ఆర్ధిక వ్యవస్థను నాశనం చేస్తుంది. దేశీయ మార్కెట్లు కూడా ఊహించని విధంగా పతనమయ్యాయి . అమెరికా డాలర్తో రూపాయి మారకపు విలువ ఆల్టైం కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లలో గందరగోళం, ఈక్విటీ మార్కెట్లు తిరిగి స్వదేశానికి రావడంతో రూపాయి విలువ దారుణంగా పడిపోయింది.

దేశీయ పారిశ్రామిక రంగంపై జూన్ చివరి వరకు కరోనా ఎఫెక్ట్
ఇక దేశీయ పారిశ్రామిక రంగం ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితికి చేరుకుంది . దేశీయ పారిశ్రామిక రంగంపై కరోనా ప్రభావంతో కొనసాగుతున్న ఒత్తిడి జూన్ చివరి వరకు కొనసాగవచ్చని అసోచామ్-ప్రిమస్ పార్ట్నర్స్ సంయుక్త అధ్యయన నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికలను వాయిదా వేసుకోవడం లేదా రద్దు చేసుకుంటున్నాయని తెలిపింది. కంపెనీలు తమ వ్యాపార కార్యాకలాపాలను ఇప్పట్లో కొనసాగించే అవకాశం లేదని అధ్యయనం చెప్తుంది. కరోనా ఎప్పుడు పెరుగుతుంది ఏ పరిస్థితులు సడన్ గా ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియని ఇబ్బందికర వాతావరణం ప్రస్తుతం ఉందని అభిప్రాయపడింది .

అసాధారణ స్థాయికి పడిపోయిన ఆర్ధిక కార్యాకలాపాలు .. పారిశ్రామిక వర్గాల్లో టెన్షన్
భారత వ్యాపారాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని ఫిక్కీ-ధ్రువ అడ్వైజర్స్ సంయుక్త నివేదిక వెల్లడించింది. గడిచిన కొన్ని వారాల్లో ఆర్థిక కార్యకలాపాలు అసాధారణ స్థాయికి పడిపోయాయని తెలిపింది. ఇక ఈ నేపధ్యంలో పరిశ్రమలు ఆర్ధిక నష్టాల నుండి బయట పడటానికి ఆచి తూచి అడుగులు వెయ్యాల్సిన అవసరం ఉంది. నష్టనివారణా చర్యల్లో భాగంగా ఉత్పత్తి నిలిపివేసిన పరిశ్రమలు, ఇప్పుడు మానవ వనరులను తగ్గించి తక్కువ ఖర్చుతో పని చెయ్యాలని ఆలోచిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఉపద్రవం ఎప్పుడు ఎలా మారుతుందో తెలీని పరిస్థితిలో జూన్ చివరి వరకు ఈ ఒత్తిడి దేశీయ పారిశ్రామిక రంగం మీద ఉంటుంది అని అసోచామ్-ప్రిమస్ పార్ట్నర్స్ సంయుక్త అధ్యయన నివేదిక ఒక అంచనా వేస్తుంది .


Click it and Unblock the Notifications