పెట్రోల్, డీజిల్ కార్ల నిషేధం? బ్రిటన్ ప్రధాని కీలక ప్రకటన!
బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ వచ్చే వారం పెట్రోల్, డీజిల్ వాహనాల నిషేధంపై ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. 2030 నాటికి పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం విధించే అంశాన్ని బోరిస్ జాన్సన్ పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి మీడియాలో వార్తలు వచ్చాయి. 2040 నాటికి పెట్రోల్, డీజిల్ కార్లను నిషేధించాలని బ్రిటన్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే బోరిస్ అధికారం చేపట్టాక ఈ గడువును 2035కు మార్చారు. ఇప్పుడు దానిని పదేళ్లకే కుదించే అవకాశాలు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
వాటికి 2035 వరకు మినహాయింపు
గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం 2040 నుండి పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం విధించాలని భావించినప్పటికీ, ఫిబ్రవరిలో బోరిస్ జాన్సన్ 20.35 నాటికే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు 2030కి కుదించాలని భావిస్తున్నారట. పర్యావరణ విధానంపై బోరిస్ వచ్చే వారం ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో డీజిల్, పెట్రోల్ కార్లపై ఓ ప్రకటన చేయనున్నారు. ఎలక్ట్రిక్, ఖనిజ ఇంధనాలతో కలిసి తయారయ్యే హైబ్రిడ్ కార్లకు 2035 వరకు మినహాయింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
73.6 శాతం పెట్రోల్, డీజిల్ కార్లు
ఈ ఏడాది బ్రిటన్లో పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాల మార్కెట్ షేర్ 73.6 శాతంగా ఉంది. ప్యూర్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ షేర్ కేవలం 5.5 శాతం మాత్రమే. ఇవి సాధారణంగా ఖరీదైనవి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఉద్గారరహిత ఎలక్ట్రిక్ వంటి వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మొగ్గు చూపుతున్నాయి. మున్ముందు ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పుంజుకోనుంది.
ఆటోమోటివ్ మార్కెట్లో పెను మార్పులు
పెట్రోల్, డీజిల్ కార్లపై బోరిస్ కీలక ప్రకటన చేస్తే బ్రిటన్ ఆటోమోటివ్ మార్కెట్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ ఆశాజనకంగా లేదు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకోవడానికి ప్రభుత్వం గణనీయంగా నిధులు కేటాయించడంతో పాటు పలు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. మౌలిస సదుపాయాల కోసం వచ్చే ఏడాది £500 మిలియన్లను ప్రభుత్వం వెచ్చించనుంది.