ఉబెర్ క్యాబ్స్ను గంటల లెక్కన బుక్ చేసుకోవచ్చు.. ఎంతో తెలుసా?
ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఉబెర్... తన వినియోగదారుల కోసం సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి వల్ల దేశవ్యాప్తంగా ప్రజల జీవన విధానంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. దీంతో వారి అవసరాలు కూడా మారిపోయాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఉబెర్... ఇకపై వినియోగదారులు తమ క్యాబ్ లను గంటల లెక్కన బుక్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే మరిన్ని గంటలకు దానిని పెంచుకోవచ్చు. ఇది పూర్తిగా కొత్త సదుపాయం. గతంలో లాగా ఇప్పుడు ప్రజలు క్యాబ్ లలో ప్రయాణించేందుకు ఇష్టపడటం లేదు.
ముఖ్యంగా తెలియని వారితో క్యాబ్ లను షేర్ చేసుకునేందుకు నో అంటున్నారు. కాబట్టి తమకు మాత్రమే పరిమితమై, అది కూడా వెయిటింగ్ ఛార్జ్ వంటి ఇబ్బందులు లేకుండా ఒక గంట కోసమో, రెండు - మూడు గంటల లెక్కనో క్యాబ్ బుక్ చేసుకుని అనుకున్న సమయానికి ప్రయాణం చేయవచ్చు. దీంతో వినియోగదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. హవర్లి రెంటల్స్ పేరుతో ప్రారంభించిన ఈ సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉండటం విశేషం.
అందరూ సేఫ్!: ఇన్ఫోసిస్ సరికొత్త 'రిటర్న్ టు వర్క్ప్లేస్'
హైదరాబాద్లో కూడా ...
ఉబెర్ ప్రారంభించిన హవర్లి రెంటల్స్ సేవలు హైదరాబాద్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను ఉబెర్ మొత్తం దేశవ్యాప్తంగా 17 నగరాల్లో ప్రారంభించింది. ఈ మేరకు ఎంట్రాకర్ ఒక కథనంలో పేర్కొంది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఉబెర్ గంటల లెక్కన క్యాబ్ లను అద్దెకు ఇచ్చే సేవలను ప్రారంభించింది. నగరాల్లో మళ్ళీ ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. కానీ వినియోగదారుల అవసరాలు మాత్రం మారిపోయాయి. అవి ప్రస్తుతం ఉబెర్ సేవలకు భిన్నంగా ఉన్నాయి. అందుకే, వారి అవసరాలకు తగ్గట్టే అధిక గంటలు క్యాబ్ లను తమ వద్దే ఉంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం అని ఉబెర్ హెడ్ ఆఫ్ సిటీస్ ప్రభేత్ సింగ్ ఒక పత్రిక ప్రకటనలో వెల్లడించారు.
గంటకు రూ 189 చార్జీ...
సేవలు సరికొత్తగా ఉండటమే కాదు.... వాటి ధరలు కూడా అందుబాటులో ఉండేలా ఉబెర్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 1 గంట ప్రయాణ సమయానికి, 10 కిలోమీటర్ల దూరానికి గాను రూ 189 చార్జీని నిర్ణయించింది. వినియోగదారులు కావాలంటే క్యాబ్ లను ఎక్కువ గంటలకు కూడా బుక్ చేసుకోవచ్చు. గరిష్టంగా ఒక క్యాబ్ ను 12 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సేవలు ఇంట్రా సిటీ (ఒకే నగరానికి) పరిమితం. ఇదిలా ఉండగా... 2017 లో కూడా ఉబెర్ ఇలాగే ఉబెర్ హైర్ పేరుతో సరిగ్గా ఇలాంటి సేవలే ప్రారంభించింది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సేవలకు అధిక డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. ప్రత్యర్థి ఓలా కూడా సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ మోడల్ ను బెంగళూరులో ప్రారంభించిన విషయం తెలిసిందే.
600 మందికి ఉద్వాసన...
ఇదిలా ఉండగా... కరోనా వైరస్ వ్యాప్తి, సుదీర్ఘ లాక్ డౌన్ విధింపు తో దేశవ్యాప్తంగా క్యాబ్ సేవలపై కూడా నిషేధం ఉండటంతో ఉబెర్ వ్యాపారం బాగా దెబ్బతింది. గత రెండు నెలల్లో విపరీతమైన నష్టాలు సంభవించాయి. దీంతో కొంత మేరకు ఖర్చులను తగ్గించుకునేందుకు సుమారు 600 మంది ఉద్యోగులకు ఉబెర్ ఉద్వాసన పలికింది. కాగా... లాక్ డౌన్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రతి కంపెనీ తనకు తోచిన విధంగా సరికొత్త సేవలు ప్రారంభించి మళ్ళీ వినియోగదారులను ఆకర్షించే పనిలో పడుతున్నాయి. ఉబెర్ కూడా ఇందుకు అతీతం కాదని ప్రస్తుత రెంటల్స్ సేవలతో నిరూపితమైంది. ఏది ఏమైనా వినియోగదారులకు ఒక మెరుగైన ఆప్షన్ లభించటం విశేషం. ఈ సమయంలో ఇలాంటి సేవల అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.