కోవిడ్-19: ఆ జోన్ల లో ఓలా, ఉబెర్ సేవలు షురూ!
దాదాపు నెలన్నర రోజులుగా ఇంటికే పరిమితం ఐన ఉబెర్, ఓలా డ్రైవర్లు ఇప్పుడు కార్ల దుమ్ము దులుపుతున్నారు. మే 4 నుంచి దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరంజ్ జోన్లలో క్యాబ్ సేవలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో డ్రైవర్లు మళ్ళీ తమ వాహనాలను రోడ్లెక్కిస్తున్నారు. అయితే, కొన్ని నగరాల్లోనే పరిమితంగానే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం కూడా అనేక షరతులతో కూడిన పరిమితులనే మంజూరు చేసింది. ప్రతి క్యాబ్ లో కూడా పాసెంజర్లు సామజిక దూరం పాటించేలా, అటు డ్రైవర్, ఇటు ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, కారును శానిటైజ్ చేయాల్సిన బాధ్యత డ్రైవర్ పార్టనర్ల పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓలా, ఉబెర్ తమ డ్రైవర్ పార్టనర్ల కు 10 సూత్రాలతో కూడిన మార్గనిర్దేశకాలను రూపొందించాయి. ఎట్టిపరిస్థితిలోనూ వాటిని తూచా తప్పకుండా పాటించాలని అవి ఆదేశిస్తున్నాయి. దేశంలో నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితి నేపథ్యంలో సామజిక వ్యవహార శైలిలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటికి అనుగుణంగా మసలుకుంటేనే క్యాబ్ లకు వ్యాపారం జరుగుతుంది.
2 నెలలు అనుకుంటే..: కొటక్ మహీంద్రా కీలక నిర్ణయం, ఆ ఉద్యోగుల వేతనాల్లో 10% కోత
100 నగరాల్లో సేవలు...
సడలించిన నిబంధనల ప్రకారం ఉబెర్, ఓలా తమ సేవలను తిరిగి ప్రారంభించాయి. ప్రస్తుతం ఓలా సుమారు 100 నగరాల్లో తన సేవలు ప్రారంభించింది. ఉబెర్ మాత్రం ప్రస్తుతం 31 నగరాల్లో తన సేవలు మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఎంట్రాకర్ తన ప్రత్యేక కథనంలో వెల్లడించింది. గతంలో ఈ రెండు క్యాబ్ హైలింగ్ సంస్థలు సుమారు 500 పైగా నగరాల్లో తమ సేవలను అందిస్తూ ఉండేవి. లాక్ డౌన్ కు ముందు ఒక్కో కంపెనీ సగటున రోజుకు 36 లక్షల రైడ్స్ అందించేవి. కానీ మాయదారి కరోనా వైరస్ చైనా నుంచి అన్ని దేశాలను చుట్టేసి ఇండియా కు కూడా వచ్చేసింది. దీంతో మన దేశంలో దీర్ఘకాలిక లాక్ డౌన్ విధించారు. దీంతో సుమారు నెలన్నరగా క్యాబ్ లకు పనిలేకుండా పోయింది. ఈ నెల 17న లాక్ డౌన్ ఎత్తివేస్తే ... పరిస్థితుల్లో కాస్త మార్పు వస్తుందేమో కానీ ఇప్పటికైతే పరిమిత సంఖ్యలో సేవలతో క్యాబ్ డ్రైవర్ల కు పెద్దగా ప్రయోజనము లేదన్నది నిపుణుల మాట.
మాస్కుతో సెల్ఫీ..
ప్రాణాంతక వైరస్ కాబట్టి కరోనా వైరస్ ను తక్కువ చేసి చూడలేం. అందుకే, ఓలా తమ డ్రైవర్ల ను ప్రతి రైడ్ కు ముందుకు వారు మాస్కు ధరించిన విషయాన్నీ ఆప్ లో ఒక సెల్ఫీలే తో ధృవీకరించుకోవాలి. లేదంటే సదరు డ్రైవర్ పై చర్యలుంటాయి. అలాగే క్యాబ్ లలో ప్రయాణించే వారు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిందే. ఆ బాధ్యత కూడా క్యాబ్ డ్రైవర్ పైనే ఉంటుంది. ఇక పోతే ఇరు వర్గాల్లో ఎవరు సరైన విధంగా నిబంధనలు పాటించటం లేదు అనిపిస్తే వెంటనే రైడ్ కాన్సల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదే సమయంలో కాష్ లెస్ పేమెంట్ సేవలకు పెద్ద పీట వేయనున్నారు. దీంతో ఒకరితో మరొకరు కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం తప్పుతుంది. ఇదిలా ఉండగా, ఉబెర్ మెడిక్ అనే పేరుతో దేశం లోని రెడ్ జోన్లలోనూ ఉబెర్ తన సేవలు కొనసాగిస్తోంది. ఐతే ఈ సేవలు కేవలం హాస్పిటల్స్, ఫార్మసీ లకు వెళ్లేవారికోసమే. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పూణే నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
సేవలు సరే...
కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మళ్ళీ జన జీవనం సాధారణ స్థాయికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రీన్ జోన్లు, ఆరంజ్ జోన్ల లో కొన్ని షరతులతో దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతులు మంజూరు చేశారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ప్రజలు కూడా రోడ్ల పైకి వచ్చేందుకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్యాబ్ కంపెనీలు కూడా తమ సేవలను ప్రారంభించాయి. కానీ, ప్రజల్లో కరోనా వైరస్ భయాలు పూర్తిగా తొలగిపోలేదు. తెలిసిన వారితోనే దగ్గరగా ఉండి మాట్లాడేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో తెలియని వాహనాల్లో, ఇతర ప్రయాణికులతో కలిసి ప్రయాణించేందుకు ప్రజలు ఎంత వరకు ముందుకు వస్తారా అన్నది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది. అత్యవసరం ఐతే తప్ప వీటి సేవలు ఉపయోగించుకునేందుకు ముందుకు రారేమోనన్న అనుమానాలు నెలకొంటున్నాయి.