ఉద్యోగం పోతుందేమో, ప్రతి ఐదుగురిలో ఇద్దరిలో టెన్షన్! సర్వేలో కీలక విషయాలు
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్దీ సంప్రదాయ శ్రామికశక్తికి నష్టం వాటిల్లుతోంది. ఆటోమేషన్ ఆందోళన కలిగించేస్థాయిలో ఉద్యోగాలను తినేస్తోంది. తాజాగా PwC సర్వేలోను ఇది వెల్లడైంది. కరోనా నేపథ్యంలో అన్ని రంగాల్లోను ఆటోమేషన్ వేగంగా జరుగుతోందని, వచ్చే అయిదేళ్ల కాలంలో తమ ఉద్యోగాలు పోతాయని దాదాపు నలభై శాతం మంది ఆందోళన చెందుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. భారత్ సహా 19 దేశాల్లో ఈ ఏడాది జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరిగిన సర్వేలో 32,500 మంది పాల్గొన్నారు.
ఉద్యోగ భయం
ఆటోమేషన్ కారణంగా తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని 60 శాతం మంది ఆందోళన వ్యక్తం చేసినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 48 శాతం మంది భవిష్యత్తులో సంప్రదాయ ఉద్యోగాలు ఉండవని అభిప్రాయపడ్డారు. 39 శాతం మంది తమ ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో సంస్థలు, పరిశ్రమలు.. మ్యాన్పవర్కు బదులు యంత్రాల వినియోగాన్ని క్రమంగా పెంచుతున్నాయని వెల్లడైంది. ప్రతి ఐదుగురిలో ఇద్దరు వచ్చే అయిదేళ్ల కాలంలో తమ ఉద్యోగాలు పోతాయని ఆందోళనగా ఉన్నారు.
కొత్త నైపుణ్యాలు
లాక్ డౌన్తో తమ డిజిటల్ నైపుణ్యాలు మెరుగయ్యాయని 40 శాతం మంది తెలిపారు. కొత్త నైపుణ్యాలపై దృష్టి సారించినట్లు ఎక్కువమంది తెలిపారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు 77 శాతం మంది, పని ప్రదేశాల్లో కొత్త టెక్నాలజీని స్వీకరించేందుకు 80 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో 69 శాతం మంది, దక్షిణాఫ్రికాలో 66 శాతం మంది ఈ విషయంలో మంచి విశ్వాసంతో ఉన్నారు.
49 శాతం మంది వ్యాపార నైపుణ్యంపై దృష్టి సారించారు. కరోనా తర్వాత సొంత వ్యాపారంపై ఎక్కువ మంది దృష్టి పెట్టారు. పని ప్రదేశంలో ఎదుర్కొంటున్న వివక్ష వలన కెరీర్ పురోగతి, శిక్షణ కోల్పోతున్నట్లు 50 శాతం మంది తెలిపారు. జాతి వివక్ష ఉందని 13 శాతం మంది, లింగ వివక్ష ఉందని 14 శాతం మంది తెలిపారు.
సమాజానికి ఉపయోగపడే సంస్థలో
సమాజానికి సహకరించే సంస్థలో పని చేయాలని 75 శాతం మంది కోరుకుంటున్నారు. ఇది ముఖ్యంగా చైనా (87 శాతం), భారత్ (90 శాతం)లో ఎక్కువగా ఉంది. సౌతాఫ్రికాలోను 90 శాతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. పిల్లలు, కుటుంబం వంటి వివిధ ఆర్థిక కారణాలతో ఉద్యోగులు ఆర్థికంగా ఉండే సంస్థలకు మొగ్గు చూపుతున్నారు.