ట్విట్టర్లో మరిన్ని కీలక ఫీచర్లు- ఉచితం మాత్రం కాదు- సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే
అమెరికాకు చెందిన సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ట్విట్టర్ తమ ప్లాట్ఫామ్పై మరిన్ని సరికొత్త ఫీచర్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఫీచర్లు మాత్రం గతంలోలా ఉచితం మాత్రం కాదు. సబ్స్ర్కైబ్ చేసుకుంటే తప్ప అందరికీ అందుబాటులో ఉండదు. దీంతో ఇప్పుడు ట్విటర్ వాడుతున్న వారంతా ఈ ఫీచర్లు కావాలంటే మాత్రం భవిష్యత్తులో ఈ ప్రత్యేక సబ్స్క్పిషన్ తీసుకోవాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఓ ఫీచర్ను ఇలా ఉచితంగా కాకుండా సబ్స్కిప్షన్తో అందుబాటులోకి తీసుకురావడంతో ట్విట్టర్ పెద్ద సాహసానికే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
సంపన్న ఖాతాదారులకు మోర్గాన్ స్టాన్లీ బిట్ కాయిన్ ఫండ్స్ యాక్సెస్
ట్విట్టర్లో మరో కొత్త ఫీచర్
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను సంపాదించుకున్న అమెరికన్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరిస్తూనే ఉంది. దీంతో పలు దేశాల ప్రపంచాధినేతలు సైతం ట్విట్టర్ను వాడేందుకు ఆసక్తి చూపుతుంటారు. అమెరికా అధ్యక్షుడు మొదలుకుని, భారత్తో పాటు ఇతర ఉపఖండాల దేశాధినేతలు, ప్రజాప్రతినిధులు, యువత ఇలా ట్విట్టర్కు అభిమానుల జాబితా చాంతాడంత ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు మారిపోతున్న యూజర్ల ఇష్టాఇష్టాలను దృష్టిలో ఉంచుకుని ట్విట్టర్ మరో సరికొత్త్ ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
ట్విట్టర్లో కొత్తగా అన్ డూ ట్వీట్ ఫీచర్
ప్రస్తుతం ట్విట్టర్లో మనం ఏది ట్వీట్ చేసినా దాన్ని సవరించేందుకు, డిలీట్ చేసేందుకు మాత్రమే అవకాశం ఉంది. కానీ ఓసారి డిలీట్, లేదా ఎడిట్ చేసిన తర్వాత దాన్ని అన్డూ చేసేందుకు వీల్లేదు. ఇప్పుడు ట్విట్టర్ ఈ ఫీచర్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలో దీనికి సంబంధించి ట్విట్టర్ అధికారిక ప్రకటన చేయబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యూజర్ల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ట్విట్టర్ ఈ అన్డూ ఫీచర్ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆప్షన్ ఐకాన్ను తాజాగా యాప్ రీసెర్చర్ జేన్ మాన్చున్ వాంగ్ విడుదల చేశారు.
అన్ డూ ఫీచర్ కావాలంటే సబ్స్కైబ్ చేసుకోవాల్సిందే
అయితే మిగతా ఫీచర్లలా దీన్ని ఉచితంగా అందించేందుకు మాత్రం ట్విట్టర్ సిద్ధంగా లేదు. ప్రత్యేకంగా సబ్ స్కైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆప్షన్ ఇవ్వాలని ట్విట్టర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ యాప్లో సబ్స్క్పిషన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. అలాగే అన్ డూ సెండ్ ఫీచర్ను కూడా యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ట్విట్టర్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ పెయిడ్ ఫీచర్లన్నీ కేవలం యాప్లో సబ్స్రైబ్ చేసుకున్న పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ట్విట్టర్లో అన్ డూ ఫీచర్ వాడకం ఇలా
ట్విట్టర్ యాప్లో ఓసారి సబ్స్కైబ్ చేసుకున్న యూజర్లకు అన్డూ బటన్ దర్శనమిస్తుంది. ఓసారి యూజర్ తాము ట్వీట్ చేసిన తర్వాత సెండ్ చేస్తారు. అలా చేయగానే వెంటనే తప్పిదాన్ని గుర్తించి దాన్ని వెనక్కి తీసుకునేందుకు లేదా తొలగించేందుకు అన్డూ బటన్ నొక్కాల్సి ఉంటుంది. అలా చేస్తే వెంటనే ఆ ట్వీట్ ఉపసంహరించవచ్చు. దీన్ని పొందాలంటే మాత్రం యాప్లో సబ్స్కిప్షన్ తప్పనిసరి అని ట్విట్టర్ వర్గాలు చెప్పినట్లు ఓ నివేదిక పేర్కొంది. అయితే ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉందని, త్వరలో అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు.
క్రియేటర్స్, పబ్లిషర్స్ కోసం సూపర్ ఫాలోస్ ఫీచర్
పెయిడ్ సబ్స్కిప్షన్ తీసుకున్న వారికి మరో ఫీచర్ను కూడా ట్విట్టర్ అందుబాటులోకి తెస్తోంది. క్రియేటర్స్, పబ్లిషర్స్ చేసే నాణ్యమైన ట్వీట్లు చూడాలంటే ఇకపై సబ్ స్కైబ్ చేసుకోవాల్సిందే. ఇలా సబ్స్కిప్షన్ తీసుకున్న వారికి సూపర్ ఫాలోస్ అనే బటన్ అందుబాటులోకి వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే క్రియేటర్లు, పబ్లిషర్ల ఎక్స్క్లూజివ్ ట్వీట్లు, వారి డైరెక్ట్ మెసేజ్లు చూసేందుకు అనుమతి లభిస్తుంది. అలాగే వారి ఆడియో సంభాషణలు కూడా వినొచ్చు. ఈ ఏడాదిలోనే ఈ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ట్విట్టర్ కసరత్తు చేస్తోంది.