తప్పుడు సమాచారం: 97% ఖాతాలు బ్లాక్, ఆ తర్వాత దిగొచ్చిన ట్విట్టర్
భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కొద్దిరోజులుగా బేఖాతరు చేస్తోన్న సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విటర్ దిగి వచ్చినట్లుగా కనిపిస్తోంది. సాగు చట్టాలపై రైతుల నిరసనలకు సంబంధించి దుష్ప్రచారం చేస్తోన్న 1,178 ఖాతాలను తొలగించాలని కేంద్ర ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేయగా తొలుత 500 మాత్రమే నిలిపివేసింది. దీంతో ప్రభుత్వం-ట్విట్టర్ మధ్య వార్ కనిపించింది. అయితే తాజాగా ఈ జాబితాకు చెందిన దాదాపు 97 శాతం ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది.
పాకిస్తానీ మద్దతుదారుల ఖాతాలు
కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శితో ట్విటర్ ప్రతినిధుల భేటీ అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. సాగుచట్టాలపై దుష్ప్రచారం చేస్తోన్న 257 ట్విటర్ హ్యాండిల్స్ పైన, ఒక హ్యాష్ట్యాగ్పై చర్యలు తీసుకోవాలని జనవరి 31న కేంద్రం ట్విటర్ను ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు వాటిని బ్లాక్ చేసినప్పటికీ, ఆ తర్వాత వాటిని పునరుద్ధరించింది. పాకిస్తానీ, ఖలిస్తానీ మద్దతుదారులకు సంబంధించిన 1,178 ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని ఫిబ్రవరి 4న తిరిగి ఆదేశాలు జారీ చేసింది.
భేటీ అనంతరం
కేంద్రం ఇచ్చిన జాబితాలో కొన్నింటిని శాశ్వతంగా తొలగించామని, మరికొన్నింటి పైన చర్యలు తీసుకున్నామని ట్విట్టర్ ప్రకటించింది. అయితే మీడియా సంస్థలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకుల అకౌంట్స్ తొలగించలేమని బ్లాగ్లో పోస్ట్ చేసింది. ట్విటర్ తీరుపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం బుధవారం ఐటీ శాఖ కార్యదర్శితో ట్విట్టర్ ప్రతినిధులు భేటీ అయ్యారు. అనంతరం 97 శాతం బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తప్పుడు సమాచారం
పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రైతుల నిరసన నేపథ్యంలో ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తిచేస్తోన్న 257 మంది ట్విట్టర్ ఖాతాలను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించగా, ఆ ఖాతాలను నిలిపివేసిన అనంతరం తిరిగి పునరుద్ధరించడం కేంద్రం ఆగ్రహానికి మొదటి కారణం. ఖాతాల నిలిపివేతపై చర్చలకు ట్విట్టర్ విజ్ఞప్తి చేయగా కేంద్రం ఓకే చెప్పింది. అయినప్పటికీ అంతలోనే బ్లాగ్ పోస్టులో ప్రభుత్వం ఆదేశాలు చట్ట విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమని ట్విట్టర్ పేర్కొంది. దీంతో కేంద్రం కూడా స్వదేసీ సామాజిక మాధ్యమం కూలో తీవ్రంగా స్పందించింది.