భారీగా పెరగనున్న టీవీల ధరలు: రూ.6,000 వరకు పెరిగే ఛాన్స్
టీవీలు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఏప్రిల్ నెల నుండి పెరిగే అవకాశం ఉంది. ఎల్ఈడీ టీవీల ధరలు వచ్చే నెలనుండి పెరగొచ్చు. అంతర్జాతీయ మార్కెటోల్ ఓపెన్ సెల్ ప్యానల్స్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఇక్కడి మార్కెట్లో ఆ ప్రభావం పడనుంది. గత నెల రోజులుగా ఈ ఓపెన్ సెల్ ప్యానల్స్ ధరలు 35 శాతం పెరిగాయి. ఇటీవల వరుసగా వివిధ ఉత్పత్తుల ధరలు వరుసగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి టీవీలు కూడా భారం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ధరల పెరుగుదల
సమాచారం మేరకు పానాసోనిక్, హేయర్, థామ్సన్ వంటి బ్రాండ్స్ టీవీల ధరలు ఏప్రిల్ నెల నుండి పెరగవచ్చు. ఎల్జీ వంటి కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. ఓపెన్ సెల్ ప్యానెల్ ధరలు పిరిగిన వెంటనే ఈ కంపెనీలు ఆ భారాన్ని కస్టమర్లకు ట్రాన్సుఫర్ చేశాయి! ఈ ధరలు పదిశాతం లోపే పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
మరో మార్గం లేదు
నెల రోజులుగా ప్యానెల్ ధరలు పెరుగుతున్నాయని, దీంతో ఏప్రిల్ నుండి టీవీల ధరలు కూడా పెరిగే అవకాశముందని, ఇప్పుడున్న ట్రెండ్ను చూస్తే టీవీల ధరలు ఐదు శాతం నుండి ఏడు శాతం పెరగవచ్చునని పానాసోనిక్ ఇండియా సౌత్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో మనీష్ శర్మ అన్నారు. హేయర్ ఇండియా అధ్యక్షులు బ్రగాంజా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరల పెంపు మినహా మరో మార్గం లేదన్నారు.
టీవీల ధరలు ఎంత పెరగవచ్చునంటే
టీవీల తయారీలో ఓపెన్ సెల్ ప్యానెల్ కీలకం. మొత్తం టీవీలో ఇదే అరవై శాతం ఉంటుంది. గత కొద్ది రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు 35 శాతం పెరిగాయి. డిమాండ్కు అనుగుణంగా ఓపెన్ సెల్ ప్యానెల్ తయారీ లేకపోవడంతో మార్కెట్లో వీటి కొరత ఏర్పడిందని, అందుకే గత ఎనిమిది నెలల్లో వీటి ధర మూడు రెట్లు పెరిగిందని చెబుతున్నారు. ఏప్రల్ నుండి టీవీల ధరలు రూ.2వేల నుండి రూ.3వేల వరకు పెరగవచ్చు. 32 ఇంచెస్ టీవీలు రూ.5వేల నుండి రూ.6వేలు పెరిగే అవకాశముందని అంటున్నారు.