ట్రంప్ పర్యటన: వీటిపై భారత్ మాటేమిటి, అమెరికాను ఒప్పిస్తుందా?
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24, 25.. రెండు రోజులు భారత్లో ఉంటున్నారు. ఆయన పర్యటన సందర్భంగా వివిధ అంశాలపై చర్చ సాగుతోంది. వాణిజ్య-టారిఫ్ విధానం, హెచ్1బీ వీసాలు, డేటా లోకలైజేషన్, ఇరాన్-రష్యా ముడి చమురు, 5జీ పరీక్షలు వంటి అంశాలపై చర్చలు ఉంటాయని భావిస్తున్నారు.
ట్రంప్ పర్యటన: అమెరికా-భారత్ వాణిజ్య కథనాలు
టారిఫ్
భారత్ టారిఫ్ కింగ్ అని గత కొద్ది నెలలుగా పదేపదే టార్గెట్ చేసిన ట్రంప్ తన భారత పర్యటనలో ఇరుదేశాల ఉత్పత్తులు, టారిఫ్స్పై ఎలా ముందుకు సాగుతారనేది ఆసక్తికరమే. స్టీల్, అల్యూమినియంపై అమెరికా టారిఫ్ పెంచగా, అల్మోండ్స్, ఆపిల్స్, వాల్నట్ వంటి వాటిపై భారత్ టారిఫ్ పెంచింది. ఇలా పెంచడంపై అమెరికా గుర్రుగా ఉంది.
హెచ్1బీ వీసా
ట్రంప్ అధికారంలోకి వచ్చాక.. ముఖ్యంగా గత కొంతకాలంగా హెచ్1బీ వీసాలపై నియంత్రణలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులు లాక్కెళ్తున్నారని, వాటిపై చర్యలు తీసుకుంటానని అధికారంలోకి వచ్చిన ట్రంప్.. అదే ప్రకారం హెచ్1బీ వీసాల సంఖ్యను తగ్గించారు. వీసా ఛార్జీలను రెండువేల డాలర్ల నుండి రెట్టింపు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. హెచ్1బీ వీసా పొందిన వ్యక్తుల భాగస్వాములు అమెరికాలోనే ఉద్యోగం చేసే అంశాన్ని కూడా సమీక్షిస్తామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ టెక్ కంపెనీలు దాఖలు చేసే హెచ్1బీ వీసాల్లో ఇటీవల ఎక్కువగా నిరాకరణకు గురవుతున్నాయి. దీనిపై భారత్ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
డేటా
పౌరుల సమాచారంపై హక్కు తమదేనని ఇండియా చెబుతోంది. సమాచారాన్ని అంతా స్థానికంగానే స్టోర్ చేయాలని ఆర్బీఐ రెండేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని అమెరికా కంపెనీలు వీసా, మాస్టర్ కార్డ్లు వ్యతిరేకిస్తున్నాయి. ఆర్బీఐతో పాటు ప్రభుత్వ విభాగాలు కూడా డేటా లోకలైజేషన్పై నియంత్రణలు విధిస్తున్నాయి. దీనిపై అమెరికా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమకు అధిక ఖర్చులు అవుతున్నాయని చెబుతున్నాయి.
ఇరాన్ చమురు
సౌదీ అరేబియా తర్వాత భారత్ ముడి చమురు కోసం ఇరాన్పై ఎక్కువగా ఆధారపడింది. గత ఏడాది అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుండి దిగుమతులు తగ్గాయి. రష్యా నుండి ఎస్400 కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. అమెరికా ఆంక్షలు ఇరకాటంలో పడేశాయి. వీటిపై భారత్ ఎలా ముందుకు వెళ్తుందనేది చూడాలి. అలాగే, చైనాకు చెందిన హువావే భారత్లో 5జీ సేవలు అందించే అంశంపై అగ్రరాజ్యం అసహనంతో ఉంది.