నిలిచిపోయిన ఎస్సెమ్మెస్లు, ఓటీపీ: నిబంధనలపై ట్రాయ్ కీలక నిర్ణయం
వాణిజ్యపరమైన ఎస్సెమ్మెస్లు, ఓటీపీలకు సంబంధించి అవాంతరాలు తలెత్తిన నేపథ్యంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (trai) కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సందేశాల నియంత్రణ కోసం తెచ్చిన నూతన నిబంధనలను అమలును వారం రోజులపాటు వాయిదా వేసింది. దీంతో సంస్థలు టెంప్లేట్స్ అప్డేట్ చేసుకునే వెసులుబాటు దొరుకుతుంది. కస్టమర్లకు ఇబ్బందులు ఉండవని ట్రాయ్ పేర్కొంది.
ఈ విషయాన్ని టెల్కోలకు తెలిపినట్లు వెల్లడించింది. ట్రాన్సాక్షన్స్ సమయంలో ఓటీపీలు రావడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ట్రాయ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. అవాంచిత, మోసపూరిత సందేశాలకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త నిబంధనలు అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు వాణిజ్య సందేశాలు పంపే సంస్థలు మెసేజ్ హెడ్డర్, టెంప్లేట్స్ను టెలికాం ఆపరేటర్ల వద్ద రిజిస్టర్ చేసుకోవాలి.
సదరు సంస్థ నుంచి వచ్చే ఎస్సెమ్మెస్ గానీ, ఓటీపీ గానీ అంతకుముందు రిజిస్టర్ అయిన వివరాలతో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా టెల్కోలు పోల్చుకుంటాయి. దీనిని ఎస్సెమ్మెస్ స్క్రబ్బింగ్ అంటారు. ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓటీపీలు రావడంలో ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ట్రాయ్ వాయిదా వేసింది.