మళ్ళీ ఉత్పత్తి ఆపేసిన టయోటా కిర్లోస్కర్ మోటార్స్ .. కార్మికుల సమ్మె కారణం
టయోటా మోటార్ కార్పోరేషన్ లిమిటెడ్ నవంబర్ 23వ తేదీ నుండి తన కార్ల తయారీ కర్మాగారంలో మరోమారు కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూనియన్ సమ్మె కొనసాగుతున్న కారణంగా టయోటా కర్మాగారంలో తమ ఆపరేషన్లు నిలిపివేసింది. కార్మికులలో ఎక్కువమంది సమ్మెలో పాల్గొన్న కారణంగా వాహన తయారీ సంస్థ అయిన టయోటా ఉత్పత్తికి సంబంధించిన ప్లాంట్ లో ప్రస్తుతం కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది.
పారిశ్రామిక కేంద్రమైన కర్ణాటక, బిడాదిలోని టయోటా కిర్లోస్కర్ మోటార్ టీకేయం కర్మాగారాలు నవంబర్10వ తేదీన యూనియన్ సమ్మెకు దిగిన తర్వాత లాకౌట్ ను ప్రకటించాయి. ఒక కార్మికుడి సస్పెన్షన్ నేపథ్యంలో, సస్పెన్షన్ ను ఉపసంహరించుకున్న డిమాండ్ తో కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. అయితే కార్మికుల సమ్మెను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ కూడా నిషేధించింది. అందరు విధుల్లో పాల్గొనాలని ఆదేశించింది.
అదేవిధంగా సంస్థకు కూడా కార్యకలాపాలు ప్రారంభించాలని, చట్టపరమైన లాకౌట్ ను తొలగించాలని ఆదేశించింది.
అయితే టీకేఎం లాకౌట్ ఎత్తివేసిన తరువాత కూడా కార్మికులు పూర్తి స్థాయిలో పనిచేయని పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిమంది మాత్రమే పని చేస్తున్నట్లుగా వాహన తయారీ సంస్థ ఇండియా యూనిట్ ప్రతినిధి పేర్కొన్నారు. ప్లాంట్ కార్యకలాపాలు సజావుగా మరియు సమర్థవంతంగా జరగాలంటే సంస్థలో కనీసం 90 శాతం మంది కార్మికులు పని చేయాలి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కార్మికులు పనిచేయకపోవడంతో ఉత్పాదక కార్యకలాపాలను కొనసాగించడం సాధ్యం కాదని సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మరో మారు సంస్థ కార్యకలాపాలను నిలిపివేసింది.