మరో భారీ ప్యాకేజీకి సిద్ధమైన కేంద్రం, అంతకుమించి ఉంటుందా?
కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీనిని కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై ఆదాయం కోల్పోతున్నారు. దీంతో 80 కోట్ల మంది ప్రజలకు లబ్ధి చేకూరేలా కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. గాడితప్పిన ఆర్థిక రంగాన్ని దారిలో పెట్టేందుకు కేంద్రం మరో భారీ ఆర్థిక ప్యాకేజీకి సిద్ధమవుతోందని తెలుస్తోంది.
Covid 19: భారత్ వృద్ధి రేటు 1.6%, ఆ సంక్షోభాలకంటే దారుణం
మరో భారీ ఆర్థిక ప్యాకేజీ
ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం మరో భారీ ఆర్థిక ప్యాకేజీకి సిద్ధమవుతోందట. ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలకమైన సప్లై, డిమాండ్ను సమతౌల్యం చేసేందుకు ఈ ప్యాకేజీని రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్యాకేజీని ఎప్పుడు ప్రకటించాలనే అంశంపై చర్చలు జరుగుతున్నాయట.
అంతకుమించి భారీ ప్యాకేజీ
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల రూ.1,70000 కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. తదుపరి ప్యాకేజీ అంతకంటే భారీగా ఉండనుందని భావిస్తున్నారు. ప్యాకేజీ రూపకల్పన కోసం అన్ని మంత్రిత్వశాఖలతో ఆర్థిక శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ఏ రంగానికి ఎలాంటి ఉద్దీపన అవసరమనే అంశాలపై చర్చిస్తున్నారు.
MSMEలకు పెద్దపీట
కేవలం చిన్న కంపెనీలు, తదితరాలకే రూ.1 లక్ష కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రెండో ప్యాకేజీ ప్రధానంగా MSMEలపై దృష్టి సారించారు. ఇలాంటి వాటికే లక్ష కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా.
దేశ ఆర్థిక వ్యవస్థల నాలుగోవంతు MSMEలది
ప్రభుత్వం అంచనాల ప్రకారం చిన్న వ్యాపారాలు భారతదేశంలోని 2.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో నాలుగో వంతు వాటాను కలిగి ఉన్నాయి. 500 మిలియన్లకు పైగా ఉద్యోగులు లేదా కార్మికులు ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలమంది ఈ వ్యాధి బారిన పడ్డారు. 88వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇండియాలో దాదాపు 6వేల కేసులు నమోదయ్యాయి. 178 మంది మృత్యువాత పడ్డారు. లాక్ డౌన్ కారణంగా మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితి కాస్త అదుపులో ఉంది.