ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే ఆఫర్, ఇవి దుమ్మురేపాయ్.. అంతలోనే!
ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవస్థలో డిమాండ్ పెంచే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పథకాలు తీసుకు వచ్చింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్యాకేజీలు ఇచ్చింది. ట్రావెల్ వోచర్లతో పాటు ప్రతి ఉద్యోగుకు పండుగ అడ్వాన్స్ ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు వీటిని 31 మార్చి 2021 గడువులోగా వీటిని వినియోగించుకోవాలని, డిజిటల్ పేమెంట్స్ ద్వారానే వీటిని చెల్లించాలని, 12 శాతం అంతకంటే ఎక్కువ జీఎస్టీ కలిగిన వస్తువులపై ఖర్చు చేయాలని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు స్టాక్స్ ఎగిశాయి. కన్స్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
క్యాష్ వోచర్, రూ.10వేల అడ్వాన్స్: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దీపావళి బంపర్ బొనాంజా
అంతలోనే... ఎగిసి'పడిన' స్టాక్స్
బ్లూస్టార్, వర్ల్పూల్, వోల్టాస్ కంపెనీల స్టాక్స్ ఏకంగా 2 శాతం లాభపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిర్మలా సీతారామన్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంతో వీటికి డిమాండ్ పెరిగే అవకాశముంది. అందుకే ఇన్వెస్టర్లు ఈ కంపెనీల స్టాక్స్ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. బ్లూస్టార్ ఉదయం ట్రేడింగ్లో భారీగా లాభపడింది. అయితే మధ్యాహ్నానికి 1.50 శాతం నష్టాల్లోకి జారుకోవడం గమనార్హం.
టైటాన్ కంపెనీ షేర్ కూడా రూ.1,278 స్థాయికి వెళ్లి భారీ లాభాలను చూసింది. మధ్యాహ్నానికి 1.81 శాతం క్షీణించి రూ.1,233.80కి దిగి వచ్చింది. వర్ల్పూల్ స్టాక్స్ సైతం రూ.2,180ని తాకి, తిరిగి 0.19 శాతం పడిపోయింది. వోల్టాస్ షేర్ ధర రూ.681 మార్క్ దాటి మధ్యాహ్నానికి 1.12 శాతం నష్టాల్లోకి జారుకుంది. ప్రారంభంలో బ్లూస్టార్, వోల్టాస్ 1.7 శాతానికి పైగా లాభపడ్డాయి. వర్ల్పూల్ 1.8 శాతం లాభపడింది. కానీ అంతలోనే పడిపోయాయి.
రికార్డ్ గరిష్టానికి..
ప్రారంభ సెషన్లో బీఎస్ఈలోని 19 రంగాల సూచీల్లో కన్స్యూమర్ డ్యూరబుల్ సూచీ టాప్ గెయినర్గా నిలిచింది. ఈ సూచీ 238పాయింట్లు లాభపడి 24,718 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. నిన్నటి సెషన్లో 24,480 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఉదయం సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా ప్రారంభమైన సమయంలోను కన్స్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ ఎగిశాయి. ఉదయం ఓ సమయంలో సెన్సెక్స్ 1 పాయింట్ లాభంతో ప్రారంభమైనప్పుడు నిఫ్టీ 4 పాయింట్లు లాభంలో ఉంది. ఆ తర్వాత కన్స్యూమర్ డ్యూరబుల్స్ జోరుతో మార్కెట్ జూమ్ అని ఎగిసింది.
ఇదీ కేంద్ర ప్రభుత్వం ఆఫర్
కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సేషన్) క్యాష్ వోచర్లు, పండుగ ప్రత్యేక అడ్వాన్స్ ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. ఎల్టీసీ నగదును 12 శాతం ఆపై జీఎస్టీ విధించే వస్తువులపై ఖర్చు పెట్టాలి. వాటిని కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా వెచ్చించాలి. వీటికి సంబంధించి జీఎస్టీ ఇన్వాయిస్ సమర్పించవలసి ఉంటుంది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, పేదలు, మధ్య తరగతి వారు, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్ ప్యాకేజీ ప్రకటించారు. అలాగే రూ.10,000 వడ్డీ లేని అడ్వాన్స్ ఇస్తున్నారు. 10 వాయిదాలలో చెల్లించాలి. ఇది మార్చి 31, 2021 నాటికి ముగియనుంది.