ఇప్పుడు కాకుంటే, ఇంకెప్పుడు: మనీ ప్రింటింగ్పై ఉదయ్ కొటక్ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్థిక ప్యాకేజీ అవసరమని, దారుణంగా దెబ్బతిన్న రంగాలకు ప్రభుత్వం ఊతమివ్వాలని ఆర్థిక రంగ నిపుణులు, ఆయా రంగాలు కోరుతున్నాయి. తాజాగా కొటక్ మహీంద్రా ఎండీ, భారత పారిశ్రామిక సమాఖ్య(CII) ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు డబ్బులు ప్రింట్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడని వ్యాఖ్యానించారు. అలాగే, ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు మరో ఉద్దీపన ప్యాకేజీ అవసరం అన్నారు.
40,000 డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్, ఏడాదిలో 14000 శాతం పెరిగిన డోజీకాయిన్
క్రెడిట్ గ్యారెంటీ స్కీంపై కొటక్
దిగువ మధ్య తరగతి సమాజాన్ని, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనివ్వడానికి సహాయక ప్యాకేజీని ప్రకటించాలని ఉదయ్ కొటక్ ప్రభుత్వాన్ని కోరారు. చిన్న పరిశ్రమలకు హామీరహిత రుణాలకు సంబంధించిన క్రెడిట్ గ్యారెంటీ స్కీం కింద ఇచ్చే పరిమాణాన్ని రూ.3 లక్షల కోట్ల నుండి రూ.5 లక్షల కోట్లకు పెంచాలని కోరారు.
కరోనా సవాళ్లను ఎదుర్కొనడానికి ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా గత ఏడాది రూ.3 లక్షల కోట్ల అత్యవసర రుణ హామీ పథకాన్ని ప్రకటించింది కేంద్రం. దీనిని రూ.5 లక్షల కోట్లకు పెంచే అంశాన్ని పరిశీలించాలన్నారు.
సెకండ్ వేవ్తో ఆర్థిక వ్యవస్థపై భారం
కరోనా సెకండ్ వేవ్ ఏప్రిల్, మే నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో లోబేస్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11 శాతం ఆర్థిక వృద్ధి నమోదవుతుందనే అంచనాలపై కూడా ఉదయ్ కొటక్ స్పందించారు. నిజానికి బేస్ ఎఫెక్టుతో చూసుకున్నా వృద్ధి రెండంకెలకు దిగువనే నమోదు కావొచ్చునని, అయితే పరిస్థితిని వేచి చూడాల్సి ఉందన్నారు.
మనీ ప్రింటింగ్కు సమయం
భారత్ ప్రస్తుతం డబ్బులు ప్రింట్ చేయాల్సిన సమయం వచ్చిందని ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం బ్యాలెన్స్ షీట్ను విస్తరించడానికి ఇది సరైనసమయమని, ద్రవ్య విస్తరణ, డబ్బు ముద్రణ కోసం ఆర్బీఐ నుండి మద్దతు ఉంటుందన్నారు. అయితే కొంత సమయం వేచి చూడాలని, మనీ ప్రింటింగ్ గురించి మాట్లాడుతూ... ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అన్నారు.