RBI Monetary Policy: ఈ నాలుగు అంశాలు కీలకం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్ష నిర్ణయాలను నేడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడిస్తారు. నేడు (బుధవారం 8 డిసెంబర్) ఉదయం పది గంటలకు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన, భారత ఆర్థిక వ్యవస్థ పైన ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దీనిని పరిగణలోకి తీసుకొని ఆర్బీఐ పలు నిర్ణయాలు వెల్లడిస్తుంది. ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల పాటు సమావేశమై, తీసుకున్న నిర్ణయాలను శక్తికాంతదాస్ నేడు వెల్లడిస్తారు. వడ్డీ రేటు, ద్రవ్యోల్భణ అంచనాలు, జీడీపీ అంచనాలు, లిక్విడిటీపై దృష్టి సారిస్తుంది.
రెపో రేటు అంచనాలు
ఒమిక్రాన్కు ముందే ఆర్బీఐ మరికొంతకాలం పాటు వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లోను వడ్డీ రేట్లపై ఆర్బీఐ స్టేటస్ కోతో వెళ్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. రెపోరేటును స్థిరంగా కొనసాగిస్తారని, అయితే రిజర్వ్ రెపో రేటును 15 నుండి 20 బేసిస్ పాయింట్లు పెంచవచ్చునని కూడా 40 శాతం మంది ఆర్థికవేత్తలు అంచనా వేశారు.
సీపీఐ ద్రవ్యోల్భణం ఆగస్ట్ నెలలో 5.3 శాతం కాగా, సెప్టెంబర్ నెల నాటికి 4.3 శాతానికి తగ్గింది. అక్టోబర్ నెలలో ఇది 4.5 శాతంగా ఉంది. FY22లో ద్రవ్యోల్భణం అంచనాలను 5.3 శాతం నుండి 5.5 శాతానికి సవరించినట్లు తెలిపారు.
జీడీపీ వృద్ధి రేటు
భారత రియల్ జీడీపీ ఏడాది ప్రాతిపదికన Q2FY22లో 8.4 శాతానికి పెరిగింది. ఎంపీసీ 7.9 శాతంగా అంచనా వేసింది. జీడీపీ అంచనాలు మించింది. FY22లో వృద్ధి అంచనాలు 9.5 శాతంగా అంచనా వేస్తోంది.
కేంద్ర బ్యాంకు వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించాలని భావిస్తోంది. డిజిటల్ కరెన్సీని, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా మరిన్ని అడుగులు వేయవచ్చు.
ఒమిక్రాన్ భయాలు
యావత్ ప్రపంచం ఒమిక్రాన్ భయాలతో గడగడలాడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్యపరపతి సమావేశం సోమవారం నుండి బుధవారం వరకు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యాన్ని అతిక్రమించకుండానే వృద్ధికి ఊతం ఇచ్చే లక్ష్యంతో ఆర్బీఐ వడ్డీరేట్ల విషయంలో వేచిచూసే ధోరణి అనుసరించవచ్చునని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఆర్బీఐ కీలక రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించడం ఇది వరుసగా తొమ్మిదోసారి అవుతుంది.
2020 మే 22న ఆర్బీఐ చివరిసారి రెపోరేట్లను సవరించింది. అప్పటి నుండి వడ్డీ రేట్లు చారిత్రక కనిష్ఠస్థాయిలో ఉన్నాయి. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి కట్టడి చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. రిస్క్లన్నీ సమతూకంగా ఉన్న కారణంగా 2021-22లో కన్స్యూమర్ సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉండవచ్చునని అక్టోబర్ సమీక్షలో ఆర్బీఐ అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5.2 శాతం ఉండవచ్చునని భావిస్తోంది.