ఎక్కడున్నామన్నది కాదు... ఏం చేస్తున్నామో లెక్క! మారనున్న ఉద్యోగుల పెర్ఫార్మన్స్ మదింపు ప్రక్రియ
కరోనా వైరస్ తో అన్నీ మారిపోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే పధ్ధతి నాటకీయంగా మారిపోయింది. రాత్రికి రాత్రి ఏ మార్పూ సాధ్యం కాదన్నది ఒకప్పటి మాట. కానీ, ప్రస్తుతం కరోనా వైరస్ కాలంలో పనిచేసే విధానం నిజంగా ఒక్క రోజులోనే మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇంత వేగంగా మారిపోయిన వర్క్ కల్చర్ కేవలం కొన్ని రోజులే కదా అనుకున్నారంతా. కానీ ఇప్పుడిప్పుడే దీనిపై కొంత స్పష్టత వస్తోంది. వర్క్ ఫ్రొం హోమ్ అనేది ఇక చాలా కంపెనీలకు శాశ్వతంగా మారిపోయేలా కనిపిస్తోంది. అదే సమయంలో వర్క్ ఫ్రొం ఎనీవేర్ అనే కాన్సెప్ట్ కూడా మొగ్గు తొడుగుతోంది.
ఇక త్వరలోనే ప్రభుత్వాలు ఈ మేరకు చట్టాలను సవరించాల్సి ఉంటుందని కూడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి మాత్రమే పరిచయం ఉన్న వర్క్ ఫ్రొం హోమ్ ఇప్పుడు దాదాపు అన్ని రంగాలకు విస్తరించింది. ఒక్క తయారీ రంగం, లేదా కేవలం మనుషుల భౌతిక అవసరం ఉన్న రంగాలు తప్పించి మిగితా అన్ని రంగాలు ఈ కాన్సెప్ట్ ను పుణికిపుచ్చుకున్నాయి. దీంతో చాలా వరకు లాక్ డౌన్ లోనూ, ఆ తర్వాత కూడా చాలా కంపెనీలు మునుపటి లాగేనే పనిచేస్తున్నాయి.
షిఫ్టింగ్ టు ఇండియా... చైనాకు భారీ షాక్! భారత్లో మొబైల్ ఫోన్ల తయారీకి 24 కంపెనీలు
చిన్న పట్టణాలు అయినా సరే...
ఒకప్పుడు మంచి జాబ్ కావాలంటే వందల కిలోమీటర్ల దూరంలో ఉండే నగరాలూ, మహా నగరాలకు వలస వెళ్లాల్సి వచ్చేది. చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉద్యోగాలు దొరికేవి కానీ, చదువుకు తగ్గ ఉద్యోగాలు ఉండేవి కావు. కానీ, కరోనా వైరస్ ఒక్క సారిగా పరిస్థితులను మార్చివేసింది. లాక్ డౌన్ విధించిన తర్వాత ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం ఇవ్వటంతో... వారంతా వారి వారి సొంత ఊర్లకు ప్రయాణం అయ్యారు. అక్కడ కూడా ఇంటర్నెట్ అందుబాటులో ఉండటంతో సొంత ఊర్లో, సొంత ఇంటి నుంచి పని చేసుకుంటూ పోతున్నారు. ఇకపై వర్క్ ఫ్రొం హోమ్ తప్పనిసరి అయితే ఇక ఊర్లలో ఉండే ఉద్యోగులు అక్కడి నుంచే నిక్షేపంగా పని చేసుకోవచ్చు. కేవలం ఉద్యోగం కోసమే నగరానికి వచ్చి స్థిరపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. దీంతో పాటు భవిష్యత్ లో దేశం లోని ఏ ప్రాంత కంపెనీ అయినా... ఎక్కడి నుంచైనా ఒక ఉద్యోగిని నియమించుకోగలదు. కాబట్టి, సమర్థులైన వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఎంత సేపు చేశామనేది కాదు...
ఆఫీస్ కు వెళ్లి పనిచేస్తున్నప్పుడు పని గంటలు చాలా కీలకంగా ఉండేవి. అలాగే అటెండెన్స్ ఆధారంగా కూడా ఉద్యోగుల ప్రమోషన్లు, పని తీరు అంచనా వేసి వారికి పదోన్నతి కల్పించేవారు. ఇంక్రెమెంట్లు, ఇతర ప్రయోజనాలు కూడా బాస్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా లభించేవి. కానీ, మారుతున్న పరిస్థితుల్లో ఎన్ని గంటలు పనిచేశామనేది కాకుండా... ఎంత పని చేశామన్నది కీలకం కానుంది. అంటే పూర్తయిన పని ఫలితాన్ని (రిసల్ట్ ) బట్టే ఇకపై ఎంప్లాయిస్ గ్రోత్ ఆధారపడి ఉంటుందని హెచ్ ఆర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు చాలా కంపెనీలు తమ తమ హెచ్ ఆర్ పాలసీ లను కూడా మార్చుకుంటున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఆన్లైన్ లో ఉద్యోగులు లాగిన్ ఐ ఉన్నారా లేదా అన్నది కూడా ట్రాక్ చేసుకునేలా కొన్ని సాఫ్ట్ వేర్ లను ఇంటెగ్రేటె చేసే అవకాశాలు ఉంటాయని తెలిపారు. దీంతో, ఉద్యోగులు ఎంత సమయం పని చేశారన్నది తెలుసుకోవచ్చు. కానీ, చివరకు మాత్రం ఎంత పనిచేశాం ... దాంతో వచ్చిన ఫలితం ఏమిటి అనేది మాత్రమే గీటురాయి కానుంది.
వారికి డిమాండ్...
ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రకాల ఉద్యోగులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా అనలిటిక్స్, కంటెంట్ రైటర్స్, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో పనిచేస్తున్న వారికి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ ఉద్యోగాలు చేసేందుకు ఆఫీస్ కె రావాల్సిన పని లేదు కాబట్టి, ఎక్కడి నుంచైనా పని పూర్తి చేయవచ్చు. అలాగే, మహిళలకు కు కూడా అధిక అవకాశాలు లభిస్తాయని హెచ్ ఆర్ ప్రొఫెషనల్స్ చెబుతున్నారు. గతంలో ఇంటి నుంచి దూరం వెళ్లి పనిచేసేందుకు ఇష్టపడని మహిళలు ఇప్పుడు కేవలం ఆన్లైన్ లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతారని, దీంతో వారికి కొత్త అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. సో, ఇకపై ఎక్కడి నుంచైనా పని చేయవచ్చు. చేతినిండా సంపాదించవచ్చు. అయితే ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ లపై పట్టు సాధించి, తగిన నైపుణ్యాలు సంపాదిస్తేనే ఉద్యోగం లభిస్తుంది. లేదంటే కష్టమేనన్న సత్యం గుర్తించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.