చైనాపై ఆధారపడే ఇండియన్ టెలికాం సంస్థల మనుగడ .. లేదంటే కష్టమే !!
చైనాతో సరిహద్దు వివాదంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నకొద్దీ భారతదేశంలోని అనేక రంగాలలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే చైనా దేశ ఉత్పత్తులను పరిష్కరించాలని, చైనా కంపెనీలపై నిషేధం విధించాలని చాలా కాలంగా ఇండియాలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. అయితే మనదేశంలో చాలా కంపెనీలు చాలా విషయాల్లో ముఖ్యంగా చైనా పైనే ఆధారపడి ఉన్నాయి అంటే నమ్మి తీరాల్సిందే. ఇక అలాంటి వాటిలో ఇండియా లోని టెలికాం సంస్థలు ముఖ్యమైనవి .
జియో ఫైబర్ బంపర్ ఆఫర్: సరికొత్త ప్లాన్..నెల రోజులు ఫ్రీ ట్రయల్..ఇంకా ఎన్నో
చైనాకు చెందిన హువావై, జెడ్ టీ ఈ కంపెనీల ఉత్పత్తులను కొనుగోలు చేయరాదంటూ భారతీయ టెలికాం సంస్థలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదేశించనున్నట్టు ప్రచారం జరుగుతుంది . అయితే ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే అది భారతీయ టెలికాం రంగానికి ఆత్మహత్యా సదృశంగా మారుతుందని పారిశ్రామిక వర్గాల భావన . భారతీయ టెలికాం పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో భారత వైర్ లెస్ టెలికాం రంగంలో 55 శాతం వాటా కలిగిన సంస్థలు ఆర్ధిక కష్టాల నుండి గట్టెక్కటం కోసం చైనా కంపెనీల ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ లావాదేవీలు జరుపుతున్నారు . భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ , ఐడియా కంపెనీలు చైనాకు చెందిన హువావై కంపెనీకి కస్టమర్లుగా ఉన్నారు.
అతి చౌకగా ఉండే ఫోర్ జి నెట్వర్క్ టెలికాం పరికరాల కోసం భారతీయ టెలికాం కంపెనీలు చైనా కంపెనీలపైనే ప్రధానంగా ఆధారపడ్డాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న బిఎస్ఎన్ఎల్ కూడా ప్రధానంగా చైనాకు చెందిన జెడ్ టీఈ కంపెనీ పై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. అసలే ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఇండియన్ టెలికాం సంస్థలు వారికి కావలసిన టెలికాం స్పేర్స్ విషయంలో చైనాపై పెద్ద ఎత్తున ఆధారపడ్డాయి. టెలికాం రంగంలో మనకు కావాల్సిన టెలికాం పరికరాలు ఇతర దేశాల్లో తయారీ ఉన్నప్పటికీ, ధర ఎక్కువగా ఉండడం మాత్రమే కాకుండా నాణ్యత కూడా చైనా వాటితో పోలిస్తే తక్కువగా ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే భారతీయ టెలికాం వ్యవస్థ చైనాపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ రెండు చైనా కంపెనీలను నిషేధించాలని డిమాండ్ పెద్దఎత్తున వినిపిస్తోంది .అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లోనూ ఈ డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఇండియాలో కూడా ఈ కంపెనీలపై నిషేధం విధిస్తే భారతదేశ టెలికాం వ్యవస్థ పరిస్థితి ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.