ఈ శతాబ్దంలోనే అతిపెద్ద స్కామ్.. ‘కమ్-ఎక్స్ ట్రేడింగ్’!
మీరు ఇప్పటి వరకు ఎన్నో స్కామ్ల గురించి విని ఉంటారు. వాటిలో ఆర్థిక మోసాలు, మరీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో చోటుచేసుకున్న స్కామ్లు కూడా ఉండొచ్చు. కానీ ఈ తరహా స్కామ్ గురించి మాత్రం ఎవరూ, ఎప్పుడూ విని ఉండరు. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద స్కామ్ ఇది. దీనిని 'కమ్-ఎక్స్ ట్రేడింగ్'గా పిలుస్తున్నారు.
ఇద్దరు వ్యక్తులు సూత్రధారులుగా.. మరికొందరు పాత్రధారులుగా వ్యవహరించి 5 ఏళ్ల కాలంలో యూరోపియన్ మార్కెట్లలో రూ.4,26,000 కోట్ల మోసానికి పాల్పడ్డారు. యూరోప్ చరిత్రలోనే ఇదో అతి పెద్ద ట్యాక్స్ స్కామ్గా నిలిచింది. ఈ కమ్-ఎక్స్ ట్రేడింగ్ కారణంగా యూరోప్లోని జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు అత్యధికంగా నష్టపోయాయి.
ఏమిటీ కమ్-ఎక్స్ ట్రేడింగ్ స్కామ్?
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒకే బాస్కెట్ స్టాక్స్పై రెండుసార్లు ట్యాక్స్ రిఫండ్ను పొందడం. ఇదే కమ్-ఎక్స్ ట్రేడింగ్. అంటే.. డివిడెండ్ను ఆధారంగా చేసుకుని సాగించే మోసం అన్నమాట. ఈ రకమైన ట్రేడింగ్ ద్వారా ఇన్వెస్టర్లు డబుల్ ట్యాక్సేషన్ నుంచి తప్పించుకుంటారు. ఇదే ప్రాసెస్ను మళ్లీ మళ్లీ చేసి ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ రిబేట్లను క్లెయిమ్ చేస్తారు.
మోసం ఎలా జరుగుతుందంటే...
షేర్ హోల్డర్లకు కంపెనీలు డివిడెండ్ చెల్లించే ముందు ఆ షేర్లను ఆప్షన్ ట్రేడింగ్లో కొంటారు. డివిడెండ్ చెల్లించిన తరువాత అదే షేర్లను అమ్మేస్తారు. డివిడెండ్ చెల్లించక ముందున్న షేరు ధర.. డివిడెండ్ చెల్లించాక తగ్గడం మామూలే. దీనివల్ల ఇన్వెస్టర్ల క్యాపిటల్ గెయిన్స్ తగ్గుతాయి. ఫలితంగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా తగ్గుతుంది. ఈ రకమైన ట్రేడింగ్ ద్వారా మోసానికి పాల్పడాలనుకునే ట్రేడర్లు పెద్ద కంపెనీకి చెందిన షేర్లను ఒకరికొకరు అప్పుగా ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో ట్యాక్స్ అథారిటీలకు ఆ షేర్లపై ఓనర్లు ఇద్దరుగా కనిపిస్తారు. నిజానికి అక్కడ ఒక్క ఇన్వెస్టరే ఓనర్. స్టాక్ బ్రోకింగ్ చేసే బ్యాంకులు ఇన్వెస్టర్ ట్యాక్స్ కట్టారని నిర్ధారిస్తాయి. దీంతో ఒకే ఓనర్ ఆ షేర్లపై ఇద్దరి రూపంలో ట్యాక్స్ రిబేట్ను క్లెయిమ్ చేస్తారు.
ఈ శతాబ్దపు అతిపెద్ద స్కామ్ ఇదే...
అమెరికా స్టాక్ మార్కెట్లో ‘పెన్నీ స్టాక్ స్కామ్' ఓ సంచలనం. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అమెరికాకు చెందిన జోర్డన్ బెల్ఫోర్ట్ ఈ స్కామ్ సూత్రధారి. తప్పుడు సమాచారంతో పెన్నీ స్టాక్(మైక్రో క్యాప్ స్టాక్లు)లను ఇన్వెస్టర్లతో కొనేటట్లు చేసి బిలియన్ల డాలర్లను అతడు వెనకేసుకున్నాడు. ఇప్పుడు ఇలాంటిదే మరో స్కామ్ యూరోప్లో వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ విశ్లేషకులు దీనిని ఈ శతాబ్దపు అతి పెద్ద స్కామ్గా, యూరోప్ చరిత్రలోనే అతిపెద్ద ట్యాక్స్ చీటింగ్గా అభివర్ణిస్తున్నారు.
సూత్రధారులు, పాత్రధారులు ఎవరంటే...
బ్రిటన్కు చెందిన మార్టిన్ షీల్డ్స్, న్యూజిలాండ్కు చెందిన పౌల్ మోరా ఈ కమ్-ఎక్స్ ట్రేడింగ్ స్కామ్కు సూత్రధారులు. వీరిద్దరూ మెరిల్ లించ్ లండన్ ఆఫీస్లో కలుసుకున్నారు. క్లయింట్లకు తక్కువ ట్యాక్స్ పడే మార్గాలను కనుక్కోవడమే మార్టిన్ షీల్డ్స్ ఉద్యోగం. ఇక్కడే ఆయన క్లయింట్ల కోసం ‘డివిడెండ్ అర్బిట్రేజ్'ను గుర్తించారు. 2004లో మెరిల్ లించ్ నుంచి బయటకు వచ్చేసే ముందు ఆయన ఈ కమ్-ఎక్స్ ట్రేడింగ్ గురించి పూర్తిగా తెలుసుకుని ఆ తరువాత పాల్ మోరాతో కలిసి ఈ శతాబ్దపు అతిపెద్ద మోసానికి శ్రీకారం చుట్టారు. ఇక ఈ స్కామ్లో పాత్రధారులు.. ఆయా దేశాలలోని వందలాది మంది బ్యాంకర్లు, లాయర్లు, ఇన్వెస్టర్లు. వీళ్లంతా కలిసి 2006-2011 మధ్య కాలంలో యూరోపియన్ మార్కెట్లలో రూ.4,26,000 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారు.
ఏయే దేశాలు నష్టపోయాయంటే...
ఈ కమ్-ఎక్స్ ట్రేడింగ్ వల్ల యూరోప్లోని జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఎక్కువగా నష్టపోయాయి. 2006 నుంచి 2011 మధ్య కాలంలో జర్మనీ ట్యాక్స్ల రూపేణా రూ. 2,13,000 కోట్లను నష్టపోగా, ఫ్రాన్స్ రూ.1,20,000 కోట్లను నష్టపోయింది. ఇంకా స్పెయిన్, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, నార్వే, ఫిన్లాండ్, పోలాండ్ వంటి ఇతర యూరోపియన్ దేశాలు కూడా ఈ స్కామ్లో కొంతమేర నష్టపోయాయి. ప్రస్తుతం జర్మన్ ప్రాసిక్యూటర్లు ఈ స్కామ్ సూత్రధారులైన మార్టిన్ షీల్డ్, పాల్ మోరాలపై కేసులు నమోదు చేశారు. జర్మనీ ట్రెజరీకి పెద్ద మొత్తంలో ట్యాక్స్ ఎగవేశారనేది అభియోగం. ఇంకా ఈ కేసులో మరో 400 మంది నిందితులపై 56 కేసులు నమోదు అయ్యాయి.
ఇదే తరహాలో.. డెన్మార్క్లోనూ...
డెన్మార్క్లోనూ ఇదే తరహాలో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. అతడి పేరు సంజయ్ షా. 1992లోనే కాలేజీ చదువులకు స్వస్తి పలికి, ఆ తరువాత అనేక ఆర్థిక సంస్థలలో పని చేసిన షా 2007లో లండన్లోని రాబో బ్యాంక్లో డివిడెండ్ ఆర్బిట్రేజ్ డెస్క్లో పని చేశాడు. అక్కడే ఈ కమ్-ఎక్స్ ట్రేడింగ్ గురించి తెలుసుకున్నాడు. ప్రస్తుతం సంజయ్ షా దుబాయ్లో ఉంటున్నారు. షా కుటుంబం కెన్యా నుంచి బ్రిటన్కు వలస వచ్చింది. ఈయన పూర్వీకులు భారతదేశంలో మూలాలున్నవారు. తనను తాను ఓ పారిశ్రామిక వేత్తగా చెప్పుకునే సంజయ్ షా కమ్-ఎక్స్ ట్రేడింగ్ ద్వారా డెన్మార్క్ ట్రెజరీ నుంచి రూ.14,200 కోట్లు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని అతడు ఖండిస్తున్నాడు. ఇక్కడ గమ్మత్తైన విషయం, అనుమానాలకు దారితీస్తోన్న సంగతి ఏమిటంటే.. షా కొన్నేళ్ల కిందట తాను కొన్న రూ.9.23 కోట్ల విలువైన యాట్కు ‘కమ్-ఎక్స్' అని పేరు పెట్టుకోవడం.