రూ 1లక్ష కోట్ల టర్నోవర్ పై పతంజలి కన్ను? ఐదేళ్ళలో నెంబర్ 1 స్థానం!
పతంజలి ఆయుర్వేద... దేశంలో ఒక సంచలనం. దాని రంగప్రవేశం వరకు స్వదేశీ ఉత్పత్తులను ఒక బలమైన బ్రాండ్ రూపంలో విక్రయించింది లేదు. బహుళజాతి కంపెనీలకు చుక్కలు చూపించి, స్థాపించిన కొన్నేళ్లలోనే రూ 10,000 కోట్ల టర్నోవర్ దాటేస్తోంది పతంజలి. దీనికి కారణం మాత్రం యోగా గురువు బాబా రాందేవ్. ఎందుకంటే భారత్ లో యోగ సాధన, దాని విశిష్టత, ఆరోగ్యంగా ఉండేందుకు అది ఎంత అవసరమో తన సొంత టీవీ ఛానల్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. దాంతో కొద్ది కాలంలోనే ఫాలోవర్స్ పెరిగారు. లక్షలాది మంది యోగాను అభ్యసించటం మొదలు పెట్టారు.
యోగాతో పాటు రాందేవ్ బాబా.... స్వదేశే అస్త్రాన్ని వాడారు. మన దేశంలోనే ఆయుర్వేదంలో ఇన్ని ప్రోడక్టులు ఉండగా, కెమికల్స్ వాడే విదేశీ ఉత్పత్తులు ఎందుకు దండగ అంటూ బాగా ప్రచారం చేశారు. సరిగ్గా సమయం చూసి, తన అంతరంగికుడు, స్నేహితుడు ఐన బాలకృష్ణ తో పతంజలి అనే బ్రాండ్ పేరుతొ వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల విక్రయంలోకి ప్రవేశించారు. దానికి బాబా రాందేవ్ బ్రాండ్ అంబాసడర్ గా ఉండటంతో దేశవ్యాప్తంగా పతంజలి అతి త్వరగా విస్తరించింది. ఇంటింటా ఎదో ఒక పతంజలి ప్రోడక్ట్ కనిపించింది.
5 ఏళ్లలో రూ 1 లక్ష కోట్లు...
అప్రతిహతంగా దూసుకుపోతున్న పతంజలి ఆయుర్వేద కు గత రెండేళ్లుగా కొంత బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు నెమ్మదించాయి. సొంత దుకాణాలు తెరిచిన వ్యాపారాలు, పతంజలి ఉత్పత్తులపై మార్జిన్లు తక్కువగా ఉండటంతో వ్యాపారం కొనసాగించలేకపోయారు. చాలా దుకాణాలు మూత పడ్డాయి. లేదా వేరే ఉత్పత్తుల విక్రయం వైపు మళ్ళాయి.
అయితే, ఈ సందర్భంలోనే పతంజలి రుచి సోయా అనే కంపెనీని కొనుగోలు చేసింది. వంట నూనెలు, తదితర ఉత్పత్తులను తయారు చేసే రుచి సోయా తీవ్రమైన అప్పుల్లో కూరుకు పోయింది. దివాళా తీసే పరిస్థితిలో దానిని రూ 4,500 కోట్లకు పతంజలి కొనుగోలు చేసింది. దీంతో అటు పతంజలి, ఇటు రుచి సోయాల సంయుక్త టర్నోవర్ వచ్చే 5 ఏళ్లలో రూ 50,000 కోట్ల నుంచి రూ 1,00,000కోట్లుగా ఉంటుందని రాందేవ్ వెల్లడించారు. ఈ విషయాన్ని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది.
రూ 25,000 కోట్లు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పతంజలి ఆయుర్వేద టర్నోవర్ రూ 25,000 కోట్లుగా ఉంటుందని బాబా రాందేవ్ అంచనావేస్తున్నారు. అందులో ఒక్క పతంజలి టర్నోవర్ రూ 12,000 కోట్ల మేరకు ఉండగా... తాజాగా కొనుగోలు చేసిన రుచి సోయా మరో రూ 13,000 కోట్ల టర్నోవర్ అందించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వదేశీ బ్రాండ్లతో విదేశి కంపెనీలకు చుక్కలు చూపించిన పతంజలి... ఆయా కంపెనీలు సైతం ఆయుర్వేద మిళితమైన ఉత్పత్తులను తప్పనిసరిగా తమ పోర్ట్ఫోలియో లో జత చేసేలా చేయగలిగింది. ముఖ్యంగా పేస్ట్ విషయంలో ఇది స్పష్టంగా కనిపించింది. అలాగే సబ్బుల విషయంలోనూ స్పష్టమైంది.
నెంబర్ 1 దిశగా అడుగులు...
దేశంలోనే ఎఫ్ ఎం సి జి రంగంలో నవంబర్ 1 స్థానానికి చేరుకోవాలని పతంజలి టార్గెట్ గా పెట్టుకుంది. అందుకే రుచి సోయా లాంటి కంపెనీలను కొనుగోలు చేసింది. తన సొంత ప్రొడక్టులకు తోడు వేగంగా టర్నోవర్ పెరిగే ఉత్పత్తులను మార్కెట్లకు పరిచయం చేయాలని భావిస్తోంది. తద్వారా అనుకున్న లక్ష్యాన్నిత్వరగా సాధించవచ్చని తలపిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో హిందూస్తాన్ యూనీలీవర్ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ కంపెనీ టర్నోవర్ సుమారు రూ 38,000 కోట్లుగా ఉంది. కానీ వచ్చే 5 ఏళ్లలో యూనీలీవర్ ను సైతం వెనక్కు నెట్టి, భారత్ లో పతంజలి ని నెంబర్ 1 స్థానానికి చేరుస్తామని, అప్పటికి కంపెనీ టర్నోవర్ రూ 50,000 కోట్ల నుంచి రూ 1,00,000 కోట్లకు చేరుకుంటుందని బాబా రాందేవ్ వెల్లడించారు.