నెల రోజుల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే?
ఇటీవల చికెన్ ధరలు పెరుగుతున్నాయి. గత నెలలో రూ.170 నుంచి రూ.180 వరకు ఉన్న చికెన్ ధర ఇప్పుడు రూ.220 వరకు ఎగబాకింది. ఇందుకు కోళ్ల దాణా ధరలు పెరగడం కూడా ప్రధాన కారణం. కోళ్లకు మొక్కజొన్న, తౌడు, నూకలు, సోయాబిన్ వంటి వాటిని దాణాగా ఉపయోగిస్తారు. వీటి ధరలు గత ఏడాది కాలంలో భారీగా పెరిగాయి. దీంతో చికెన్ ధరలు కూడా పెరుగుతున్నాయి.
అక్టోబర్ నెలలో దసరా పండుగ సమయంలో హైదరాబాదులో కిలో చికెన్ ధర రూ.180 వరకు ఉంది. ఇప్పుడు ఇది రూ.220 వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంతకంటే ఎక్కువ ధర కూడా పలుకుతోంది. ఏడాది కాలంలో దాణా విషయానికి వస్తే కిలో మొక్క జొన్న ధర రెండింతలు, సోయాబిన్ ధర దాదాపు రూ.7, నూకలు దాదాపు రెండింతలు, తౌడు దాదాపు రెండింతలు పెరిగింది. ఈ ప్రభావం చికెన్ ధరలపై పడింది.
పెరిగిన దాణా ధరల నేపథ్యంలో ఒక్కో కోడికి అయ్యే మేత ఖర్చు దాదాపు రెండింతలు అవుతోంది. అంతేకాదు, చాలామంది రైతులు కోళ్ల పెంపకం నుంచి తప్పుకున్నారు. చికెన్ ధరలు పెరగడానికి ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు.