ఆస్తిపోయినా నెం.1 జెఫ్ బెజోస్: ప్రపంచ ధనికుల్లో తెలుగువారు వీరే, హైదరాబాద్ స్థానం ఇదీ..
హూరన్ రిచ్ లిస్ట్ 2020లో అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ (56) మొదటి స్థానంలో నిలిచారు. ఆయన సంపాదన ఏడాదిలో 7 బిలియన్ డాలర్లు తగ్గింది. అయినప్పటికీ ఆయనే ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా నిలిచారు. 140 బిలియన్ డాలర్ల ఆస్తితో వరుసగా మూడో ఏడాది ఈ స్థానం దక్కించుకున్నారు. విడాకుల కారణంగా మాజీ భార్య మెకంజీ బెజోస్కు 44 బిలియన్లు వెళ్లాయి.
గంటకు రూ.7 కోట్లు, ముఖేష్ అంబానీ భారీ సంపాదన వెనుక.., రాకెట్లా అదానీ ఆస్తులు
100 బిలియన్ డాలర్లలో ఈ నలుగురే..
జెఫ్ బెజోస్ తర్వాత ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్ట్ అర్నాల్డ్ 107 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. గత ఏడాది ఇతని ఆస్తి 21 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆ తర్వాత బిల్ గేట్స్, వారెన్ బఫెట్ మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. 100 బిలియన్ డాలర్లు కలిగిన వారిలో బెజోస్, అర్నాల్ట్, గేట్స్, బఫెట్ మాత్రమే ఉన్నారు.
బిలియనీర్లు 2,817 మంది
హూరన్ విడుదల చేసిన జాబితాలో 2,817 మంది ఉన్నారు. కొత్తగా ఈ జాబితాలోకి 480 మంది వచ్చారు. అంటే అంతర్జాతీయంగా ప్రతిరోజు ఒకరి కంటే ఎక్కువ మంది బిలియనీర్లు పుట్టుకు వచ్చారు. చైనా నుండి 799 మంది, అమెరికా నుండి 626 మంది ఈ జాబితాలో ఉన్నారు. ఆ తర్వాత ఇండియా 138 మందితో మూడో స్థానంలో ఉంది. అమెరికా, భారత్ కంటే చైనాలో ఎక్కువ సంపన్నులు ఉన్నారు.
టాప్ 10 వీరే..
ప్రపంచంలోని టాప్ టెన్ జాబితాలో రూ.140 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ 1వ స్థానంలో, బెర్నార్డ్ అర్నాల్డ్ 2వ స్థానంలో (107 బిలియన్ డాలర్లు), బిల్ గేట్స్ 3వ స్థానం (106 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ 4వ స్థానం (102 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్బర్గ్ 5వ స్థానం( 84 బిలియన్ డాలర్లు), అర్మాన్సియో ఒర్టెగా 6వ స్థానం (81 బిలియన్ డాలర్లు), కార్లోస్ స్లిమ్ 7వ స్థానం (72 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ 8వ స్థానం (68 బిలియన్ డాలర్లు)తో ఉన్నారు. 9వ స్థానంలో 67 బిలియన్ డాలర్లతో ముగ్గురు నిలిచారు. ల్యారీ పేజ్, ముఖేష్ అంబానీ, స్టీవ్ బాల్మర్ ఉన్నారు.
హూరన్ జాబితాలో తెలుగువారు...
ఈ జాబితాలో ఏడుగురు తెలుగువారు ఉన్నారు. దివిస్కు చెందిన మురళీ, ఫ్యామిలీ (4.3 బిలియన్ డాలర్లు) 539వ ర్యాంకు, MEILకు చెందిన పీ పిచ్చిరెడ్డి 1.90 బిలియన్ డాలర్లతో 1530వ ర్యాంకు, MEILకు చెందిన పీవీ కృష్ణారెడ్డి 1.80 బిలియన్ డాలర్లతో 1607వ ర్యాంకు, అరబిందో పీవీ రాంప్రసాద్ రెడ్డి 1.80 బిలియన్ డాలర్లతో 1607 ర్యాంకు, మైహోమ్ రామేశ్వర రావు 1.40 బిలియన్ డాలర్లతో 2000వ ర్యాంకు, డాక్టర్ రెడ్డీస్ కే సతీష్ రెడ్డి 1.20 బిలియన్ డాలర్లతో 2276వ ర్యాంకు, డాక్టర్ రెడ్డీస్ జీవీ ప్రసాద్-అనురాధ 1 బిలియన్ డాలర్లతో 2642వ స్థానంలో ఉన్నారు.
టాప్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్
భారత్లో 138 మంది బిలియనీర్లు ఉండగా, ఇందులో 50 మందితో ముంబై నగరం నుండి ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీ (30), బెంగళూరు (17) ఉన్నారు.
50 మంది ముంబై బిలియనీర్ల వద్ద 218 బిలియన్ డాలర్లు, న్యూఢిల్లీలోని 30 మంది బిలియనీర్ల వద్ద 76 బిలియన్లు, 17 మంది బెంగళూరు బిలియనీర్ల వద్ద 42 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఆ తర్వాత అహ్మదాబాద్లోని 12 మంది బిలియనీర్ల వద్ద 36 బిలియన్ డాలర్లు, హైదరాబాద్లోని 7గురు బిలియనీర్ల వద్ద 13 బిలియన్ డాలర్లు ఉన్నాయి.
కొత్తగా వచ్చిన వారిలో..
జాబితాలో కొత్తగా వచ్చిన వారిలో జైచౌదరి అత్యంత ఎక్కువ సంపాదనతో ఉన్నారు. అతని ఆస్తులు రూ.25,000 కోట్లు. ఆ తర్వాత వివేక్ చాంద్ సెహగల్ రూ.15,200 కోట్లతో ఉన్నారు.