Telecom War 2.0: అంబానీ-అదానీల టెలికాం వార్..! అంబానీ 2010 ప్లాన్ రిపీట్ చేస్తున్న అదానీ..
Telecom War 2.0: టెలికాం రంగంలో భారత్తో పాటు ఆసియాలో అతిపెద్ద సంపన్నులు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల మధ్య పోటీ నెలకొంది. 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైంది. జూలై 26 నుంచి వేలం ప్రారంభం కానుంది. అదానీ గ్రూప్ కన్స్యూమర్ మొబిలిటీ స్పేస్లోకి ప్రవేశించే ఉద్దేశ్యం లేదని, కంపెనీ తన స్వంత ఉపయోగం కోసం స్పెక్ట్రమ్ను ఉపయోగిస్తుందని చెబుతోంది.
అయితే టెలికమ్యూనికేషన్స్ రంగంలో గౌతమ్ అదానీ పెద్ద పోటీకి తెరలేపేందుకు అదానీ సిద్ధమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ముఖేష్ అంబానీ తరహాలో ఈ రంగంలో ఆయన ముందుకు సాగుతున్నారు. అంటే రానున్న రోజుల్లో ఈ రంగంలో వీరిద్దరి మధ్య ప్రత్యక్ష పోటీ ఏర్పడటం వల్ల కస్టమర్లు లబ్ధి పొందవచ్చని తెలుస్తోంది.
అంబానీ బాటలో అదానీ..
అదానీ డేటా నెట్వర్క్స్ ద్వారా 5G వేలంలో అదానీ గ్రూప్ ప్రవేశిస్తోంది. గుజరాత్ సర్కిల్లో ILD, NLD మరియు ISP-B అధికారాలతో యూనిఫైడ్ లైసెన్స్ కోసం అదానీ డేటా నెట్వర్క్లకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయింది. ఏకీకృత లైసెన్స్ గుజరాత్ సర్కిల్లో సుదూర కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యాలను అందించడానికి అదానీ గ్రూప్కు అవకాశం ఇస్తుంది. నిపుణుల అంచనా ప్రకారం.. అదానీ గ్రూప్ త్వరలో లేదా తరువాత వినియోగదారుల మెుబిలిటీ సేవల్లోకి ప్రవేశించవచ్చు.
ముఖేష్ అంబానీ కూడా 2010లో అదే విధంగా టెలికాం రంగంలోకి ప్రవేశించారు. పూర్తి కనెక్టివిటీ సేవలను అందించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ 2013లో యూనిఫైడ్ లైసెన్స్ను తీసుకుని.. 2016లో జియో నెట్వర్క్ను ప్రారంభించింది. జెఫరీస్ ఫైనాన్షియల్ గ్రూప్ ఇంక్ కూడా ఇదే అంచనాలను వెల్లడించింది.
అలజడి సృష్టిస్తున్న అదానీ..
అదానీ గ్రూప్ ఏకీకృత లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తే, భవిష్యత్తులో అది వాణిజ్య సేవలను అందించవచ్చు. రిలయన్స్ 2010లో ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ను కొనుగోలు చేయడం ద్వారా టెలికాం రంగంలోకి ప్రవేశించింది. రిలయన్స్ 2016లో జియోను ప్రారంభించడం ద్వారా భారతీయ టెలికాం రంగంలో భయాందోళనలు సృష్టించింది. ఇప్పటికే విపరీతమైన పోటీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టెలికాం రంగంలో అదానీ రాక అలజడి సృష్టిస్తోంది.
స్పెక్ట్రమ్ పోటీలో కంపెనీలు..
5జీ స్పెక్ట్రమ్ వేలం కోసం నాలుగు కంపెనీల నుంచి దరఖాస్తులు అందాయని టెలికాం శాఖ తెలిపింది. ఇందులో అదానీ డేటా నెట్వర్క్స్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ ఉన్నాయి. అదానీ క్యాప్టివ్ నాన్ పబ్లిక్ నెట్వర్క్ పర్మిట్ తీసుకోవచ్చు. కానీ ఆయన ఖరీదైన వేలాన్ని ఎంచుకోవటం వెనుక భవిష్యత్తులో టెలికాం రంగంలోకి అరంగేట్రం ఆలోచన ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ వార్త వెలువడిన నాటి నుంచి భారత స్టాక్ మార్కెట్లలో టెలికాం రంగానికి సంబంధించిన కంపెనీల షేర్లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.