'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్.. 2024 నాటికి దీన్ని సాధించడమే కేంద్రం లక్ష్యం
Telecom: ఈరోజుల్లో కమ్యూనికేషన్స్ రంగానికున్న ప్రాముఖ్యత ఎనలేనిది. అయిన వారికి దూరంగా ఉన్నా, ఫోన్ల ద్వారా నిత్యం అందుబాటులో ఉంటున్నాం. ఇందుకు కారణం ఆయా టెలికాం కంపెనీల నెట్ వర్క్ కవరేజ్. కానీ ఇప్పటికీ దేశంలో కొన్ని ప్రాంతాలకు ఇంటర్ నెట్ సదుపాయం లేకపోవడం, నగరాలు 5Gతో దూసుకుపోతున్న రోజుల్లో కేవలం 2G తో నెట్టుకొచ్చే ప్రదేశాలు ఉండటం దురదృష్టకరం. అయితే ఈ పరిస్థితి త్వరలోనే మారనుంది.
2024 నాటికి అన్ని మారుమూల గ్రామాలను 4G నెట్ వర్క్ తో కవర్ చేస్తామని టెలికాం సహాయ మంత్రి దేవుసిన్ చౌహాన్ తెలిపారు. మరింత అభివృద్ధి సాధించే దిశగా ప్రయత్నం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం పేరేపిస్తారని వెల్లడించారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలోనూ ప్రభుత్వ పథకాలు చివరి మైలు వరకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెబుతుంటారని గుర్తు చేశారు. వీటిని ప్రేరణగా తీసుకుని ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
'మెరుగ్గా పని చేస్తున్నారని ప్రధాని ప్రశంసించినా, ప్రతి ఇంటినీ కవర్ చేసే విధంగా ప్రయత్నించమని చెబుతారు. 4G సంతృప్త ప్రాజెక్ట్ గురించి చూస్తే దాదాపు 40 వేల గ్రామాలకు సిగ్నల్ లేదు. 2024 నాటికి వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము' అని చౌహాన్ తెలిపారు. ఆదివారం ప్రసారం కానున్న 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్ వేడుకలను పురస్కరించుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇన్ స్టాల్ చేసిన అన్ని గ్రామాల్లో 4జీ నెట్వర్క్ సామాజిక, ఆర్థిక పరివర్తనకు దారి తీస్తుందని మరియు డిజిటల్ అంతరాలను తగ్గించగలదని మంత్రి పేర్కొన్నారు. చివరి మైలు వద్ద ఉన్న పౌరుడు కూడా డిజిటల్ గా కనెక్ట్ అయితేనే ప్రభుత్వ జవాబుదారీతనాన్ని తనిఖీ చేయగలడన్నారు. గ్రామాలను కనెక్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్య విలువలతో ప్రజలను సమీకరించడమేనని తెలిపారు. 26 వేల 316 కోట్లతో దేశవ్యాప్తంగా అన్ కవర్డ్ గ్రామాల్లో 4G మొబైల్ సేవలను కల్పించేందుకు కేంద్ర మంత్రివర్గం జూలై 2022లోనే ఆమోదించడం గమనార్హం.